alert: జేఈఈ మెయిన్ 2023 పరీక్షల షెడ్యూల్లో మార్పులు
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో పరీక్షను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలపగా.. తాజాగా ఈ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది.
బీఈ, బీటెక్ విభాగాల్లో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష(పేపర్ 1, రెండు షిప్టుల్లో).. జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, జనవరి 28న బీఆర్క్ బీ ప్లానింగ్ విభాగంలో పేపర్-2ఏ, 2బీ పరీక్ష(మధ్యాహ్నం షిప్టులో) జరుగుతుందని తెలిపింది.
దేశ వ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. పరీక్ష జరిగే నగరాల సమాచారానికి సంబంధించిన స్లిప్ ను అభ్యర్థులు చెక్ చేసుకోవాలని సూచించింది. అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. తదుపరి వివరాల కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్ https://jeemain.nta.nic.in/ తనిఖీ చేస్తుండాలని విద్యార్థులకు సూచించింది.
కాగా, జేఈఈ మెయిన్ 2023 మాక్ టెస్ట్ పరీక్షకు సిద్ధం కావడానికి మొబైల్ అప్లికేషన్ 'నేషనల్ టెస్ట్ అభ్యాస్'లో అందుబాటులో ఉంది. జేఈఈ మెయిన్స్ 2023కి హాజరు కాబోయే అభ్యర్థులు మొబైల్ యాప్లో ఉచిత మాక్ టెస్ట్ని యాక్సెస్ చేయవచ్చు.
జేఈఈ మెయిన్ 2023 రెండుసార్లు జరుగుతుంది. మొదటిది జనవరిలో, తదుపరిది ఏప్రిల్లో. జేఈఈ మెయిన్స్కు సంబంధించిన బీఈ, బీటెక్ పేపర్లు పేపర్ 1గానూ, బీఆర్చ్, బీప్లానింగ్ పేపర్లు పేపర్ 2ఏ, పేపర్ 2బీలుగానూ నిర్వహించబడతాయి.