అబద్ధాలాడారు, రూ.2కోట్లు వెంటనే చెల్లించండి: కేజ్రీకి షాకిచ్చిన రాంజెఠ్మలానీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాయరుగా తప్పుకుంటున్నట్లు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ బుధవారం ప్రకటించారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ గట్టి షాకిచ్చారు. కేజ్రీవాల్కు తాను లాయరుగా తప్పుకుంటున్నట్లు జెఠ్మలానీ బుధవారం ప్రకటించారు. విచారణ సమయంలో కేంద్రమంత్రి జైట్లీపై అభ్యంతరకర పదాలు ఉపయోగించమని న్యాయవాది జెఠ్మలానీకి తానేమీ సూచించలేదని కేజ్రీవాల్ న్యాయస్థానానికి వెల్లడించిన మరుసటి రోజే జెఠ్మలానీ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
'నేను కేజ్రీవాల్ లాయరుగా తప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పారు. నాకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని న్యాయస్థానానికి చెప్పారు. కానీ ఆయనే అలా మాట్లాడమన్నారు' అని జెఠ్మలానీ స్పష్టం చేశారు. తనకు రావాల్సిన మిగతా ఫీజు రూ.2కోట్లు కూడా వెంటనే చెల్లించాల్సిందిగా సీఎం కేజ్రీవాల్కు జెఠ్మలానీ ఓ లేఖ రాశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై జైట్లీ వేసిన పరువు నష్టం కేసు విచారణ సమయంలో జెఠ్మలానీ అభ్యంతరకర పదం ఉపయోగించారు. నిజాయతీ లేని వ్యక్తి అని అర్థం వచ్చే విధంగా జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పదాలను కేజ్రీవాల్ చెబితే ఉపయోగిస్తున్నారా? లేదంటే వ్యక్తిగతంగా చేస్తున్నారా? అంటూ జైట్లీ ప్రశ్నించారు.
తన పరువుకు భంగం వాటిల్లిందంటూ రెండోసారి రూ.10కోట్లకు పరువు నష్టం కేసు వేశారు. అయితే.. జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసే సమయంలో అభ్యంతరకర పదాలు ఉపయోగించమని జెఠ్మలానీకి తానేమీ సూచించలేదని మంగళవారం సీఎం కేజ్రీవాల్ న్యాయస్థానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అబద్ధాలు చెబుతున్నారంటూ జెఠ్మలానీ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.