JioPhone Next:ఫోను విడుదల తేదీ- ధర-ఫీచర్లు గురించి తెలుసుకోండి..!
ముంబై: ఆసియా ఖండం కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆ సంస్థ 44వ వార్షిక సర్వసభ్యసమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఏటా జరిగే సమావేశంలో కొత్త ప్రాడక్ట్ను మార్కెట్కు పరిచయం చేయడాన్ని ఆనవాయితీగా తీసుకొస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. గురువారం జరిగిన సమావేశంలో కూడా ముఖేష్ అంబానీ జియో ఫోన్ నెక్ట్స్ను ప్రకటించారు. ఈ జియో ఫోన్ నెక్ట్స్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి.. భారత్లో దీని ధర ఎంతుంటుంది.. అనేదాని గురించి తెలుసుకుందాం.
జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు
గతేడాది గూగుల్ మరియు రిలయన్స్ జియో సంస్థలు భాగస్వామ్యం నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, గూగుల్ హెడ్ సుందర్ పిచాయ్లు సంయుక్త ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే గూగుల్ భాగస్వామితో రిలయన్స్ జియో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేసింది. దీనిపేరే జియో ఫోన్ నెక్ట్స్.
జియోఫోన్ నెక్ట్స్లో గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ను ఆటోమేటిగ్గా బయటకు చదవడం, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. భారత్లో 300 మిలియన్ మంది మొబైల్ ఫోన్ వినియోగదారులున్నారని.. ఇందులో చాలామంది ఇంకా 2జీ సేవలకే పరిమితమవుతున్నారని అంబానీ చెప్పారు. ఎందుకంటే సాధారణ 4జీ స్మార్ట్ ఫోన్ ధరను కూడా చెల్లించలేని స్థితిలో వారున్నారని చెప్పారు.
విడుదల ఎప్పుడు
ఈ క్రమంలోనే గతేడాది గూగుల్ హెడ్ సుందర్ పిచాయ్తో తాను సమావేశమై ఇరువురు సరికొత్త ఫోన్ గురించి చర్చించినట్లు అంబానీ గుర్తుచేశారు. రెండు సంస్థలు కలిసి నెక్ట్స్ జనరేషన్, అధిక ఫీచర్లు కలిగి సరసమైన ధరకే ఫోను అందించాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే జియో ఫోన్ నెక్ట్స్కు సంబంధించి కొన్ని ప్రధాన ఫీచర్లను వెల్లడించడం జరిగింది.
అంతేకాదు గణేష్ చుతర్థి నాటికి ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేస్తామని కూడా తెలిపారు. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన జియో ఫోన్ నెక్ట్స్ విడుదల అవుతుంది. ఇది కేవలం భారత్లోనే సరసమైన ధరకు అందించడం లేదని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఫోన్ తక్కువ ధరకే దొరుకుతుందని చెప్పారు.
త్వరలో 5జీ సేవలందిస్తామన్న సుందర్ పిచాయ్
ఇక 2జీ నుంచి 4జీకి అప్గ్రేడ్ అవ్వాలనుకునే వినియోగదారుల కోసం సరసమైన ధరకే జియోఫోన్ నెక్ట్స్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సరికొత్త ఫోన్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ డెవలప్ చేసి ఇస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో జియో నెక్ట్స్ ఫోన్ వస్తోంది. కెమెరా కూడా మంచి క్వాలిటీతో వస్తోంది. ఇక రెగ్యులర్గా వచ్చే ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఈ ఫోన్కు వస్తాయని అంబానీ వివరించారు. ఇక గురువారం రోజున అంబానీ కొత్త ఫోన్ గురించి ప్రకటించిన తర్వాత గూగుల్ హెడ్ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో రిలయన్స్ మరియు గూగుల్ సంస్థలు కలిసి భారత్లో సరసమైన ధరలకే 5జీ సేవలను అందిస్తాయనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.