బీజేపీతో పొత్తుపై పన్నీరుసెల్వం ట్విస్ట్: అందుకేనని కనిమొళి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే (పురట్చితలైవి అమ్మ) పార్టీ భావిస్తోంది.
చెన్నై: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే (పురట్చితలైవి అమ్మ) పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ శనివారం చేసిన ఓ ట్వీట్ ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం భేటీ అయిన మరుసటి రోజునే ఈ ట్వీట్ రావడం గమనార్హం. అయితే ఆ తర్వాత కాసేపటికే దానిని తొలగించి సవరణను పెట్టారు.
రజనీ బోర్ కొట్టిస్తున్నారు: కస్తూరి, ఫ్యాన్స్తో ఫైట్
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీతో పొత్తు విషయమై నిర్ణయం తీసుకుంటామని తొలుత ట్వీట్ చేశారు. వెంటనే దానిని తొలగించి.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటించిన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకొనే విషయాన్ని ఆలోచిస్తామన్నది తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఇప్పుడేం చెప్పలేం
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తు ఉంటుందనే వూహాగానాలకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెక్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది నిర్ణయిస్తామన్నారు.
రజనీకాంత్పై..
మరోవైపు సినీ నటుడు రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాజకీయ కారణాలే: కనిమొళి
ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి ప్రధాని మోడీతో పన్నీర్సెల్వం భేటీ అయ్యారని డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఆరోపించారు.
ముఖ్యమంత్రి అయ్యేందుకు స్టాలిన్ పగటి కలలు కంటున్నారని పన్నీర్సెల్వం విమర్శిస్తున్నారని, ఎన్నికలు వస్తే ఎవరు పగటి కలలు కంటున్నారనే విషయం తేలిపోతుందన్నారు. జీఎస్టీ వల్ల తమిళనాడుకు ఎక్కువ నష్టం వాటిల్లనుందని, దీనిని వ్యతిరేకిస్తూ డీఎంకే పోరాడనుందన్నారు.
ప్రధాని మోడీతో పన్నీర్సెల్వం భేటీ కావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ప్రధానిని కలిశారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. అన్నాడీఎంకేను బీజేపీ నడిపిస్తోందని గతంలో తాము చెప్పామని, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా వ్యాఖ్యలు దానిని ధ్రువీకరిస్తున్నాయన్నారు.