మంత్రివర్గం, అసమ్మతి, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, సీఎం కుమారస్వామి, ఒకే కులానికి 9 !
బెంగళూరు: మంత్రి వర్గం ఏర్పాటు చేసే సమయంలో ఎమ్మెల్యేల్లో సహజంగానే అసమ్మతి ఉంటుందని, అయితే జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి వర్గం ఏర్పాటు చేసిన తరువాత సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. 2008లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మంత్రి వర్గం ఏర్పాటు చేసిన సందర్బంలో అసమ్మతి ఎమ్మెల్యేల అనుచరులు బస్సులకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు.
2008 నాటి స్థాయి అసమ్మతి ఇప్పుడు జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో లేదని సీఎం కుమారస్వామి అన్నారు. మంత్రి పదవులు రాలేదని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారితో మాట్లాడుతామని కుమారస్వామి అన్నారు. అసమ్మతి ప్రభావం సంకీర్ణ ప్రభుత్వం మీద పడుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి వర్గంలో అనుభవం ఉన్న వారు ఉన్నారని, కొత్తగా ఉత్సాహంతో కొందరు మంత్రులు పని చెయ్యడానికి సిద్దం అయ్యారని, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రి వర్గంలో ఆయన వర్గానికి చెందిన ఒక్కలిగ (గౌడ) 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.