కాంగ్రెస్ మీడియా కో ఆర్డినేటర్పై వేటు.. శివకుమార్పై కామెంట్ల నేపథ్యంలో..
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కో ఆర్డినేటర్ ఎంఏ సలీంపై బహిష్కరణ వేటు పడింది. కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బయటపడటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోలో మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప కూడా ఉన్నారు. డీకే శివ కుమార్, ఆయన సహచరులు లంచాలు స్వీకరించారని సలీం చెప్తున్నట్లు లీక్ అయిన వీడియోలో కనిపిస్తోంది. అంతకుముందు ఆరు నుంచి ఎనిమిది శాతం ఉండేదని, అది 10 నుంచి 12 శాతం అయిందని సలీం చెప్పారు. ఇదంతా డీకే శివ కుమార్ చేసిన సర్దుబాటు అని, ఆయన సహచరుడు ముల్గుండ్ దాదాపు రూ.50 కోట్లు నుంచి రూ.100 కోట్లు వరకు సంపాదించుకున్నారని, అలాంటపుడు డీకే శివకుమార్ ఇంకెంత సంపాదించుకుని ఉంటారో ఊహించుకోవచ్చునని అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్ళారు. సలీంను ఆరు సంవత్సరాలపాటు పార్టీ నుంచి బహిష్కరించాలని ఈ సంఘం నిర్ణయించింది. ఉగ్రప్పకు షోకాజ్ నోటీసు పంపించింది. ఉగ్రప్ప బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డీకే శివ కుమార్పై అవినీతి ఆరోపణలను తోసిపుచ్చారు. శివ కుమార్ ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. కమిషన్లు, అవినీతికి కాంగ్రెస్ చాలా దూరమని చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. డీకే శివ కుమార్పై బీజేపీ చేసిన ఆరోపణలను సలీం ప్రస్తావించారని తెలిపారు.
Recommended Video
వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారిన నేపథ్యంలో బుధవారం మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప మీడియాతో మాట్లాడారు. మీడియా సమన్వయకర్త సలీం..కొంతమంది వ్యక్తులు డికె శివకుమార్ డబ్బులు తీసుకుంటున్నారని చిన్నగా చెప్పారు. వాస్తవానికి ఇది బీజేపీ చేస్తున్న ఆరోపణ.. సలీమ్ కేవలం నాకు ఈ విషయాన్ని చెబుతున్నాడు అంతే. బీజేపీ పార్టీ డీకే శివకుమార్పై చేస్తున్న ఆరోపణలపై సలీమ్ నాకు అవగాహన కల్పించాడు. విలేఖరుల సమావేశం తర్వాత సలీమ్తో మాట్లాడాను ..శివకుమార్ పై చేసిన వ్యాఖ్యలు తన ఆరోపణ కాదని ... అది బీజేపీ మరియు ఇతరులు చేసిన ఆరోపణ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మీడియా ఈ విషయమై మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీకు సమాచారం ఉండాలి ... అందుకే నేను మీకు చెప్పాను అని సలీమ్ తనతో అన్నాడని ఉగ్రప్ప చెప్పారు. డీకే శివకుమార్పై బీజేపీ చేసిన వ్యాఖ్యలపైనే తాము చర్చించుకున్నామని, ఆయనపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.