కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆజాతశత్రువు ఎన్. ధరంసింగ్ కన్నుమూత !
కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ కన్నుమూత కౌన్సిలర్ టూ ముఖ్యమంత్రి ఆజాతశత్రువు, ఎవ్వరితో విభేదాలు లేవు
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎన్. ధరంసింగ్ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధరంసింగ్ బెంగళూరు నగరంలోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గురువారం మద్యాహ్నం చికిత్స విఫలమై ధరంసింగ్ మరణించారు. 1936 డిసెంబర్ 25వ తేదిన కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా జీవర్గీలో ధరంసింగ్ జన్మించారు. గుల్బర్గ మునిసిపాలిటి కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004 మే 28 నుంచి 2006 ఫిబ్రవరి 3వ తేదీ వరకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో ధరంసింగ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు (కాంగ్రెస్) మల్లికార్జున ఖార్గేకి ధరంసింగ్ అత్యంత సన్నిహితుడు. దేవరాజ్ అరసు, గుండురావు, బంగారప్ప, వీరప్పమొయిలీ, ఎస్ఎం. క్రిష్ణ కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో ధరంసింగ్ మంత్రిగా పని చేశారు. పార్టీలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉంటున్న ధరంసింగ్ ఆజాతశత్రువు అని పేరు తెచ్చుకున్నారు. ధరంసింగ్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా అనేక మంది ప్రముఖ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.