నిరసన మధ్యే బిల్లులు: శివ ప్రసాద్ 'మా తెలుగుతల్లి'
న్యూఢిల్లీ: లోకసభలో విపక్షాల ఆందోళనలు, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల ఆందోళనల మధ్యనే కేంద్రమంత్రులు గురువారం బిల్లులు సమావేశ పెట్టారు. వాయిదా అనంతరం పన్నెండు గంటలకు తిరిగి ప్రారంభమైన ఉభయ సభల్లో పరిస్థితి మారలేదు. ఉభయసభల్లో సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్ దూసుకెళ్లి నిరసన తెలిపారు.
లోక్సభలో ఆందోళనల మధ్యే కేంద్రమంత్రులు బిల్లులను ప్రవేశపెట్టడగా, సభ్యుల ఆందోళనల మధ్యే పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో సమైక్య నినాదాలతో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు.
శంకరంబాడి సుందరాచారి వేషధారణలో శివప్రసాద్
విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ టిడిపి ఎంపి శివప్రసాద్ మా తెలుగు తల్లికి గేయాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి వేషధారణలో వచ్చారు. ఆయన గేయాన్ని తనదైన శైలిలో నిరసిస్తూ పాడారు.
మా తెలుగు తల్లికి విభజన పూల దండా, మా కన్న తల్లికి అమంగళ హారతులా, కడుపులో బంగారు మాయమై పోవునా, కనుచూపులో కరుణ పేగుపై మిగులునా, గలగలా గోదారి ప్రవాహం ఉండదా, బిరబిరా కృష్ణమ్మ సొగసులిక చూడమా, బంగారు పంటలే పండక భూములన్ని బీడులా, అమరావతి శిల్పాలు ఆర్తనాలు జేయ, త్యాగయ్య గొంతు ఎండ అపస్వరాలే రాగ, తిక్కన్న కలం, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, కృష్ణదేవరాయ కీర్తిని పంచుకుందామంటే.. కాదని కోట్లాది జనులు అంటుంటే నా చెవులు మోగుతుంటే, ఏ ఆటలు ఆడుతాం, ఏ పాటలు పాడుతాను.. ఏ తులసీ దళం వచ్చి ఈ విభజనను ఆపి కోట్లాది ప్రజలను కాపాడునో అంటూ పాడారు.