షాక్: చీటింగ్ కేసులో సూపర్ స్టార్ రజనీకి హైకోర్టు నోటీసులు: రాజకీయాల్లోకి రావాలంటే !
చెన్నై: రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ చీటింగ్ కేసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు, ఆయన వియ్యంకుడికి సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో శుక్రవారం మద్రాసు హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ చీటింగ్ కేసుతో మీకు ఎలాంటి సంబంధం ఉంది అని సమాధానం చెప్పాలని రజనీకాంత్ కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వియ్యంకులు
ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు ధనుష్ ను రజనీకాంత్ అల్లుడిగా చేసుకున్న విషయం తెలిసిందే. ధనుష్ సూపర్ స్టార్ అల్లుడు కావడంతో రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా వియ్యంకులు అయ్యారు.
Recommended Video
ఫైనాన్షియర్
రజనీకాంత్, కస్తూరి రాజా వియ్యంకులు అయ్యే వరకూ బాగానే ఉంది. తరువాత అసలు కథ మొదలైయ్యింది. 2012లో ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్ సంత్ బోత్రా అనే ఆయనతో కస్తూరి రాజాకు పరిచయం అయ్యింది. ఆ సమయంలోఇద్దరూ ఆర్థిక లావాదేవీలు చర్చించుకున్నారు.
మైహున్ రజనీకాంత్
2012లో ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా మైహున్ రజనీకాంత్ అనే సినిమా నిర్మించడానికి సిద్దం అయ్యారు. ఆ సందర్బంలో ఆయన కస్తూరి రాజాను కలిశారు. రజనీకాంత్ పేరుతో సినిమా తీస్తున్నామని, అందుకు అనుమతి ఇప్పించాలని ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా మనవి చేశారు.
సినిమా మొదలైయ్యింది
రజనీకాంత్ పేరుతో తీసే సినిమాకు తాను అనుమతి ఇప్పిస్తానని, అందు కోసం రూ. 40 లక్షలు గుడ్ విల్ ఇవ్వాలని చెప్పిన కస్తూరి రాజా ఆ మొత్తం నగదు తీసుకున్నారు. తరువాత ముకుంద్ బోత్రా మైహున్ రజనీకాంత్ సినిమా ప్రారంభించారు. తరువాత కస్తూరి రాజా తనకు రూ. 25 లక్షలు అవసరం ఉందని, తాను ఇవ్వకుంటే రజనీకాంత్ ఇస్తారని నమ్మించి లిఖితపూర్వకంగా బాండు రాసి సంతకం చేసి చెక్ లతో సహ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాకు ఇచ్చాడు.
రజనీకాంత్ దెబ్బతో !
హైహున్ రజనీకాంత్ సినిమా పూర్తి అవుతున్న సమయంలో తన పేరుతో సినిమా తియ్యడానికి తాను ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని, సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని సూపర్ స్టార్ రజనీకాంత్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో హైహున్ రజనీకాంత్ సినిమా విడుదల కాలేదు.
చెక్ లు బౌన్స్
కస్తూరి రాజా ఇచ్చిన చెక్ లు బ్యాంకులో వెయ్యడంతో అవికాస్తా బౌన్స్ అయ్యాయి. రజనీకాంత్ ను సంప్రధించి బాండు చూపించి నగదు ఇవ్వాలని ముకుంద్ బోత్రా మనవి చేశారు. ఆ సందర్బంలో తనపేరు చాల మంది దుర్వినియోగం చేస్తున్నారని, తనకు సంబంధం లేదని రజనీకాంత్ సమాధానం ఇచ్చారని ముకుంద్ బోత్రా ఆరోపించారు.
పోలీసులు, కోర్టు
చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు విచారణ చెయ్యకుండానే కేసు మూసి వేశారని ఆరోపిస్తూ ముకుంద్ బోత్రా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు కౌంటర్ దాఖలు చెయ్యడంతో మద్రాసు హైకోర్టు ముకుంద్ బోత్రా పిటిషన్ విచారణకు తిరస్కరించింది.
సుప్రీం కోర్టు ఆదేశం
మద్రాసు హైకోర్టు తన పిటిషన్ విచారణకు స్వీకరించలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముకుంద్ బోత్రా విచారణకు అనుమతి తీసుకు వచ్చి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు వచ్చింది. కస్తూరి రాజా, రజనీకాంత్ కలిసి తనను మోసం చేశారని ముకుంద్ బోత్రా కోర్టులో ఆరోపించారు.
రజనీకాంత్ కు నోటీసులు
శుక్రవారం మద్రాసు హైకోర్టు ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసుతో మీకు ఎలాంటి సంబంధం ఉంది, తాను నగదు ఇవ్వకుంటే మీరు ఇస్తారని కస్తూరి రాజా చెప్పారని అంటున్నారని, బ్యాంకులో చెక్ లు బౌన్స్ అయ్యాయని, ఈ కేసుతో మీకు ఎలాంటి సంబంధం ఉంది అనే వియంలో మీరు ఏం సమాధానం చెబుతారని రజనీకాంత్ ను ప్రశ్నించిన న్యాయమూర్తి ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేశారు.