మే 27 నెహ్రూ ఆగిపోయారు: మోడీ ప్రారంభించారు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి దిశానిర్దేశనం చేసిన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మే 27, 1964న కన్నుమూశారు. ఆయన అనంతరం యాభై ఏళ్ల తర్వాత ఎన్నికల్లో అంతటి ఘన విజయాన్ని సాధించి ప్రధాని పీఠంపై కూర్చున్నారు నరేంద్ర మోడీ. నెహ్రూ లాగే భారీ మెజార్టీతో నెగ్గిన నరేంద్ర మోడీ సంచలనం సృష్టించారు.
తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూపై ప్రజలు ఎన్ని ఆశలయితే పెట్టుకున్నారో... ఇప్పుడు ప్రధాని అయిన మోడీపైనా అన్ని ఆశలు ఉన్నాయి. యాధృశ్చికంగా వీరిద్దర్ని మే నెల దగ్గరకు చేర్చింది. వీరిద్దరి కాలల మధ్య 50 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ వీరి ముందు జాతి నిర్మాణం సవాల్గా ఉంది.
నెహ్రూవియన్ - మోడీఫైడ్
నెహ్రూ చనిపోయి యాభై ఏళ్లయినప్పటికీ ఆయన అనుసరించిన రాజకీయ, ఆర్థిక ప్రణాళికలు దేశానికి పునాదిగా మారాయి. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ చూపిన బాటలో ఇండియా నడిచింది. గాంధీ అనంతరం నెహ్రూ దేశంలో సంస్థాగత, ఆర్థిక మార్పులు తీసుకొచ్చారు. విమర్శలు ఎన్ని ఎదురైనా అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశారు.
నెహ్రూ ముందుచూపు గల నేత
ముందు చూపుగల నెహ్రూ పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక, ఆరోగ్య, ఉన్నత విద్యా, పరిశోధనలు, ప్రణాళికల్లో సంస్థాగత మార్పులు తీసుకొచ్చారు. నెహ్రూ నిర్ణయాల్లో కొన్ని లోపాలున్నప్పటికీ జాతి నిర్మాణం కోసం ఆయన ముందుకెళ్లారు. సొంత పార్టీలోనే విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. నెహ్రూ ఆశయాలైన పారిశ్రామికాభివృద్ధి, ఆదాయ వృద్ధి లాంటి అంశాలు అమలు పర్చడంలో విఫలమైన యూపిఏ ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
వారసత్వాన్ని మోడీ కొనసాగిస్తారా?
జాతి నిర్మాణం కోసం కృషి చేసిన నెహ్రూ మాదిరిగానే నరేంద్ర మోడీ కూడా జాతిని అభివృద్ధి పథంలో నడపాల్సి ఉంది. మంచి పాలనాధక్షుడైన మోడీ.. భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పథంలో నడిపే అవకాశం ఉంది. నెహ్రూ చేసిన జాతి నిర్మాణాన్ని మళ్లీ మోడీ కొనసాగించనున్నారు. స్వాతంత్ర్యానంతరం జన్మించిన నరేంద్ర మోడీ నాయకత్వంలో 26, 2014 నుంచి భారతదేశానికి కొత్త శకం ప్రారంభమైంది.