మాయావతిని ప్రధానిని చేద్దామన్న పవన్ కల్యాణ్: అసలు ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్న బీఎస్పీ అధినేత్రి
లక్నో: ఈ సారి లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థులుగా గుర్తింపు పొందిన కొందరు సీనియర్ నాయకులు ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఈ ఎన్నికలకు దూరం అయ్యారు. తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవేగౌడ దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తనకు, తన కుటుంబానికి కంచుకోటగా చెప్పుకొనే కర్ణాటకలోని హాసన లోక్ సభ స్థానం ఎన్నికల బరి నుంచి దేవేగౌడ తప్పుకొన్నారు. ఆ స్థానాన్ని తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు అప్పగించారు. దేవేగౌడ ఈ సారి పోటీ చేస్తారా? లేదా? అనేది అనుమానాస్పదంగా ఉంది. తాజాగా- ప్రధానమంత్రి అభ్యర్థిగా గుర్తింపు పొందిన మాయావతి కూడా బరి నుంచి బయటికి వచ్చారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి ప్రకటించారు. అవసరం అనుకుంటే.. ఏదో ఒక స్థానాన్ని ఖాళీ చేయించి, తరువాత పోటీ చేస్తానని అన్నారు.
బుధవారం ఆమె లక్నోలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ స్థానం నుంచి పోటీ చేసినా, తాను విజయం సాధిస్తాననే నమ్మకం తనకు ఉందని, నామినేషన్ వేసి, ఇంట్లో కూర్చున్నా గెలుస్తాననే ధైర్యం తనకు ఉందని అన్నారు.
బీజేపీని ఓడించడానికి ఎస్పీ, రాష్ట్రీయ లోక్ దళ్ లతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. అయినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. ఎలాంటి రాజకీయ పరిస్థితులనే విషయంపై మాయావతి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తాము పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ చురుగ్గా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications