తమిళుల ఆరాధ్య దైవం ఎంజీఆర్ కుమార్తెకు జీవిత ఖైదు
చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో ఎంజీ రామచంద్రన్ పెంపుడు కుమార్తె భాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది.
వివరాల్లోకి వెళితే... ఎంజీ రామచంద్రన్ మరో పెంపుడు కుమార్తె సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న అళ్వార్ పేటలో హత్యకు గురైయ్యారు. ఆయనను కారుతో గుద్ది, ఇనుపరాడ్లతో మోది మరీ చంపారు. ఈ కేసును తొలుత అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ, ఆ తర్వాత సీబీ-సీఐడీకి అప్పగించారు.
ఈ కేసులో సుమారు 70 మంది సాక్ష్యాలను కోర్టు విచారించింది. ఎంజీ రామచంద్రన్ తన భార్య జానకి సోదరుడు ఏడుగురి పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే ఆయనకు సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తి కోసం సుధ, భాను శ్రీధర్ల మధ్య వివాదం చెలరేగింది.
దీంతో కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి సుధ భర్తను బాను శ్రీధర్ చంపించినట్టు దర్యాప్తులో పోలీసులు కనిపెట్టారు. తొలుత ఈ కేసులో పెద్ద కూతురైన లతా రాజేంద్రన్ను పోలీసులు అనుమానించారు. అయితే దర్యాప్తులో భాగంగా ఈ హత్య కేసులో భాను శ్రీధర్ హస్తం ఉందని పోలీసులు నిగ్గుతేల్చారు.
కేవలం ఆస్తి కోసమే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో రుజువైంది. ఈ హత్య కేసుకు సహకరించినందుకు గాను కానిస్టేబుల్ కరుణకు బాను రూ. 4లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. భాను శ్రీధర్కు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది.
కోర్టు తీర్పుపై విజయన్ భార్య సుధ స్పందిస్తూ తన భర్తకు చివరికి న్యాయం దక్కిందని చెప్పారు. ఇందుకు సహకరించిన పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.