తుపాకీ బెదిరింపులతో హడలెత్తించాడు.. ఆపై వారం రోజులు 'రేప్'
అత్యాచారానికి గురైన బాలిక.. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా.. వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. బెదిరింపులతో వారిని లోబరుచుకుంటున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. తుపాకీతో బెదిరించి ఓ యువతిపై వారం రోజులుగా ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సమయపూర్ బద్లీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పక్కింటి అమ్మాయిని తుపాకీతో బెదిరించాడు. తనకు లొంగకపోతే చంపేస్తానని బెదిరించాడు. అలా గత వారం రోజుల నుంచి యువతిపై అతను అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో బాధిత బాలిక విషయం ఎవరితోను చెప్పలేదు.
ఊహించని ఈ సంఘటనకు బాలిక తీవ్ర షాక్కు గురైంది. ఓరోజంతా గది తలుపు పెట్టుకుని బాలిక ఏడుస్తూనే ఉండిపోయింది. ఏం జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు ఎంతలా అడిగినా చెప్పడానికి ఒప్పుకోలేదు. ఇదే క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లిదండ్రులు సోమవారం నాడు ఆసుపత్రికెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె అత్యాచారానికి గురైనట్లు నిర్దారించారు.
ఆపై.. బాధిత బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా.. వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అతను హెచ్చరించినట్లు బాధిత బాలిక తెలిపింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం వేట కొనసాగుతోంది.