మోడీకి 10 మార్కులిచ్చేది వారే: చిద్దూ, రామాలయం కట్టాల్సిందే: ఆరెస్సెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పైన మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సోమవారం నాడు విమర్శలు గుప్పించారు. ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వానికి సున్నా మార్కులేనని అన్నారు. మోడీ ప్రభుత్వం 20 శాతం పాలనను పూర్తి చేసుకుందని, అయితే వారిచ్చిన హామీల మేరకు అభివృద్ధి కానీ, ఉద్యోగ కల్పన కానీ జరగలేదన్నారు.
డబ్బులొచ్చే పారిశ్రామికవేత్తలు మాత్రమే దీనికి పదికి పది మార్కులు వేస్తారన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అనుకున్నా, వాటిని విధానాలుగా రూపొందించి, కార్యక్రమాలుగా అమలు చేసే నిర్దిష్ట ప్రక్రియ కనిపించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపణలు చేయటమే అభివృద్ధి కాబోదన్నారు.
ఏడాది కాలంలో ప్రతిపక్షాలు అడ్డుకుంది జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు మాత్రమేనని తెలిపారు. వాస్తవానికి మోడీ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీలను కూడా పక్కకు తప్పించి 50 బిల్లుల్ని చట్టాలుగా ఆమోదించుకుందన్నారు. తమ ప్రభుత్వం బాగా పని చేస్తోందని ఊదరగొడుతోందన్నారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వాన్ని యూపీఏ3గా అభివర్ణించారు. యూపీఏ ప్రభుత్వ విధానాలనే మోడీ ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు.
రామాలయం కట్టాల్సిందే: ఆరెస్సెస్
ఆరెస్సెస్ మరోసారి రామాలయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాములవారి గుడి కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. ఎన్నికల హామీని నిలుపుకోవాలని ఆరెస్సెస్ సూచిస్తే, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యాచరణ రూపొందిస్తోంది.
బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దులపై ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆరెస్సెస్ అఖిల భారతీయ సహ సంపర్క్ ప్రముఖ్ అరుణ్ కుమార్ నాగపూర్లో సూచించారు.
వీహెచ్పీ అయితే, రామాలయ నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే దిశగా ప్రభుత్వంతో చర్చలకు సాధువుల ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు, హరిద్వార్లో జరుగుతోన్న వీహెచ్పీ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశం తొలిరోజున ఓ తీర్మానాన్ని ఆమోదించింది.