నిషేధ బిల్లుకు ఆమోదం: ఇక బార్లలో నృత్యాలు ఉండవు
ముంబై: రాష్ట్రంలోని బార్లలో మహిళలు, యువతులతో చేయించే అశ్లీల నృత్యాలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని బార్లలో నిర్వహిస్తున్న నృత్యాలను నిషేధిస్తూ రూపొందించిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
దీంతో ముంబైతోపాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని బార్లలోనూ మహిళలు, యువతులతో నృత్యాలు చేయించడం నేరంగా మారింది. బార్లలో నృత్యాలపై నిషేధం విధించేందుకు తాము కొత్త బిల్లును రూపొందించినట్లు ఇటీవలే మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ ప్రకటించారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. నిషేధం ఎత్తివేయాలని ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలకు సవాల్గా మారింది.
తాము సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడే న్యాయ విభాగం సూచనల మేరకు నూతనంగా ఈ బిల్లును రూపొందించి సభలో ఆమోదింపజేశామని ఆర్ఆర్ పాటిల్ తెలిపారు. బార్లలో మహిళల నృత్యాలను నిషేధిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం సరైందికాదని గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గత జులైలో ఇచ్చిన తన తీర్పులో సమర్థించింది.
కాగా, రాష్ట్రంలోని పలు బార్ల యాజమాన్యాలు ఈ విషయంలో గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నిషేధం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతారని కోర్టుకు విన్నవించాయి. మరికొంత ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని కోర్టుకు తెలిపాయి. దీంతో ముంబై హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు గత జులైలో తన తీర్పు వెలువరించింది.