అప్పుడే ఈ ఉపాయం వచ్చింది, అసలు ఆ డబ్బెక్కడ?: కరెన్సీ రద్దుపై మోడీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఓ అధికారి ఇంట్లో మంచం కింద రూ.3 కోట్లు పట్టుబడ్డాయని, ఆ సొమ్ము ఎవరిదని, అవినీతి ఎందుకు అని ప్రజలు ప్రశ్నించారని, అప్పుడే తనకు ఓ ఉపాయం తోచిందని, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై యూపీలోని ఘాజీపూర్లో బీజేపీ పరివర్తన్ మహాసభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. పేదలు, ధనవంతులు సమానం అయ్యారా? లేదా? అని ప్రశ్నించారు.
తాను పేదల కష్టాలను అర్థం చేసుకోగలనని, అందరికీ అండగా ఉంటానని, చేయవలసినదంతా చేస్తానన్నారు. స్వయంగా తానే ఎన్నో కష్టాలను అనుభవించానన్నారు. ప్రజల కష్టాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి, పొందోమ్మిది నెలలపాటు ఈ దేశాన్ని కారాగారంగా మార్చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పావలా కాసులను రద్దు చేసిందని, వాళ్ళు అంతకన్నా ఎదగలేకపోయారన్నారు. ఉగ్రవాదులకు, నక్సలైట్లకు భారీ ధనరాశులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. సరిహద్దుల ఆవలి నుంచి శత్రువులు నిధులు పంపిస్తున్నారన్నారు.
వారందరిపైనా యుద్దం చేయడానికి పెద్ద నోట్లు రద్దు చేయాలా? వద్దా? అని అడిగారు. సామాన్యులు నకిలీ, అసలు నోట్ల మద్య తేడాను తెలుసుకోగలరా? అన్నారు. పిల్లల పెళ్ళిళ్ల కోసం దాచుకున్న సొమ్ముపై ఒక్క అధికారి కూడా కన్ను వేసే ప్రసక్తే లేదన్నారు.
మంచం క్రింద డబ్బు దాచుకున్నవాళ్లని వదిలేయాలా అన్నారు. దొంగతనంగా కారుల్లో వచ్చి పెద్ద నోట్లను పారబోస్తున్నారని, అటువంటివారిని వదిలేది లేదని చెప్పారు. అవినీతిపరులకు నిద్రపట్టడం లేదని, నిద్రమాత్రలు కొనుక్కునేందుకు చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
పేదలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే, పన్ను ఎగవేతదార్లకు నిద్ర మాత్రలు అవసరమవుతున్నాయన్నారు. నల్లధనాన్ని ఏం చేయాలో తెలియక వారు ఆందోళన చెందుతున్నారన్నారు. నల్లధనంపై తాను తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మోడీ వివరించారు.
తాను పేదలకే సేవ చేస్తానని చెప్పారు. ప్రజల ఓటు దేశంలో మార్పు తెస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్యానెల్ను పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చశారని, అభివృద్ధి లక్ష్యాలను ఆ ప్యానెల్ నిర్ణయించిందన్నారు. ఆ లక్ష్యాలను తాను పూర్తి చేస్తానని చెప్పారు. దేశంలో డబ్బుకు లోటు లేదని, కానీ అది ఎక్కడ ఉన్నదనేదే సమస్య అన్నారు. ఉండకూడని వాళ్ల వద్ద ఉందన్నారు.