చెదరలేదు: నాడు వరదలకు కేదార్నాథ్, నేడు భూకంపానికి పశుపతినాథ్
న్యూఢిల్లీ: నాడు తీవ్ర వరదల్లో కేదార్నాథ్ ఆలయం, నేడు భారీ భూకంపంలో పశుపతినాథ్ ఆలయం చెక్కు చెదరలేదు. 2013వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ వరదలు తీవ్ర నష్టాన్ని, ఆవేదనను మిగిల్చిన విషయం తెలిసిందే. వరదల వల్ల వేలాది మంది మృతి చెందారు. ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవంతులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. బస్సులకు బస్సులే వరద ధాటికి నిలవలేకపోయాయి.
భవంతులకు భవంతులే వరదలకు కొట్టుకు పోయినప్పటికీ కేదార్నాథ్ ఆలయం మాత్రం అలాగే ఉంది. ప్రధాన ఆలయం మాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. దాదాపు పదిహేను అడుగుల ఎత్తు వరద నీరు, బురద, భారీ బండరాళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో చాలా నష్టం జరిగింది. ఆలయ పరిసరాల్లోని భవంతులు నేలమట్టమయ్యాయి. కానీ కేదార్ నాథ్ ఆలయ గోడలు కూడా కొద్దిగా కూడా కదల్లేదు.
కేదార్ నాథ్ ఆలయం ఇంత పటిష్టంగా ఉండటంతో ఇదంతా దేవుడి వల్లే అని కొందరంటే, ఇంత పటిష్టంగా ఎవరు, ఎప్పుడు నిర్మించారనే ఆసక్తికర చర్చ సాగింది. వివరాల ప్రకారం ఈ ఆలయాన్ని దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారు.
అసలు ఈ ఆలయాన్ని కట్టించింది పంచపాండవులు అనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధితో పాటు పలు గుళ్లు, భవంతులు కొట్టుకుపోయాయి. ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ఆలయాన్ని క్రీ.శ.900-1000 మధ్యకాలంలో ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారు.
మరోవైపు, నేడు నేపాల్లో భారీ భూకంపం వచ్చి, మూడువేల ఏడువందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. పెద్ద పెద్ద భవంతులు కుప్పకూలాయి. నేపాల్ భూకంపంతో ప్రపంచం నివ్వెరపోయింది. చారిత్రక ధరహార స్థూపంతో పాటు ఎన్నో నేలమట్టమయ్యాయి. అయితే, మూడో దశాబ్దానికి చెందిన పశుపతినాథ్ ఆలయానికి ఎలాంటి ముప్పు కలగలేదు.
7.9 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలకు ఖాట్మాండులో ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పశుపతినాథ్ ఆలయానికి వెలుపల గోడలు కొంచెం బీటలు వారాయి. అంతకుమించి చెక్కుచెదరలేదని స్థానికులు చెబుతున్నారు.