రాష్ట్రపతి ఎన్నికలు: ద్రౌపది ముర్ము వర్సెస్ గోపాల్ కృష్ణ గాంధీ, రేసులో వెంకయ్య
విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మాగాంధీ ముని మనుమడు గోపాల కృష్ణగాంధీ పేరు ఖాయమని వినిపిస్తున్నది. మరోవైపు బీజేపీ దాదాపు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే చెప్తున
న్యూడిల్లీ: వచ్చే జూలై 25న ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, విపక్ష కూటముల మధ్య పోటాపోటీ నెలకొంది. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మాగాంధీ ముని మనుమడు గోపాల కృష్ణగాంధీ పేరు ఖాయమని వినిపిస్తున్నది. మరోవైపు బీజేపీ దాదాపు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే చెప్తున్నారు.
వచ్చే జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ యాదవ్, శరద్ పవార్ పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. ఇక దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరించడానికి ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ముప్ప వరపు వెంకయ్యనాయుడు పేరు కూడా ఎన్డీయే ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
విపక్షాల మధ్య ఐక్యత సాధించేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్ర మాజీ గవర్నర్ గోపాల కృష్ణగాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కోవడం విపక్షాలకు విషమ పరీక్ష కానున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
మమత ప్రతిపాదించిన గోపాల కృష్ణ
జాతిపిత మహాత్మగాంధీ ముని మనుమడు ఈ గోపాలకృష్ణ గాంధీ. 2004 - 2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేశారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనాల్సిందిగా గోపాలకృష్ణగాంధీని మరోసారి ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ కూడా రాశారు. 1946 ఏప్రిల్ 22వ తేదీన జన్మించిన గోపాలకృష్ణ గాంధీ భారత్ సివిల్ సర్వెంట్గా, దౌత్యవేత్తగా సేవలందించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడిగా కూడా పనిచేసిన గోపాలకృష్ణ.. భారత రాష్ట్రపతికి కార్యదర్శిగానూ సేవలందించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకల్లో భారత హై కమిషనర్గా పని చేశారు. విపక్షాలు ఇతర నేతల పేర్లను పరిశీలిస్తున్నా గోపాల కృష్ణగాంధీ పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఇతర నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
నెలాఖరు కల్లా విపక్షాల అభ్యర్థి ఖరారు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, యునైటెడ్ జనతాదళ్ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విపక్షం జరుపుతున్న చర్యలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సారథ్యం వహిస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా అభ్యర్థి పేరును విపక్షాలు ఖరారుచేస్తాయని కథనం.
తటస్థ వైఖరి గల నేతలకు అధిక డిమాండ్
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని నిలపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తటస్థుల పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శరద్ యాదవ్ వంటి నేతలకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. బిజూ జనతాదళ్, డీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలను విపక్షాల నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. 2017 జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలన్న విషయమై ఈ పార్టీలేవీ ఇంకా నిర్ణయించుకోలేదు. జూన్లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి జన్మ దినోత్సవం సందర్భంగా యావత్ విపక్షం ఒక గూటికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఒడిశాలో పాగా వేయాలంటే ద్రౌపది ముర్ము
ఒకవేళ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైతే తొలిగి గిరిజన మహిళ కానున్నారు. ఒడిశాకు చెందిన ఈ 58 సంవత్సరాల మహిళా రాజకీయవేత్త ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. 2000 - 04 మధ్య ఒడిశా బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈమెకు మూడు అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మహిళ కావడం. అత్యున్నత పదవికి ఆమెను ఎంపిక చేయడం ద్వారా మహిళల్లో మద్దతు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ రకంగానూ మద్దతు కూడగట్టవచ్చు. ఒడిశాకు చెందిన అభ్యర్థి కాబట్టి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) కూడా ఆమెను బలపర్చాల్సి రావచ్చు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ద్రౌపది ముర్ము.. బైరాంచి నారాయణ్ తుడు తనయ.
వెంకయ్యనాయుడుకు గల అవకాశాలు ఇలా
ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ప్రస్తుతం కేంద్రంలో సమాచార, ప్రసారశాఖ నిర్వహిస్తున్న ముప్పవరపు వెంకయ్య నాయుడు (67) దక్షిణాది భారతంలో విస్తరించడానికి కీలకమైన నేతగా ఉన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు. మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థించిన మొదటి నాయకుల్లో ఒకరు. దక్షిణాదిలో విస్తరించాలని ఉరకలేస్తున్న కాషాయపార్టీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చు.
ఇలా ఎన్సీపీ, శివసేన మద్దతూ పొందొచ్చు
మహారాష్ట్ర రాష్ట్ర ఆడబడుచుగా సుమిత్రా మహాజన్ (74) 2014లో లోక్సభ స్పీకర్ అయ్యారు. అంతకుముందు ఎనిమిదిసార్లు ఎంపీలోని ఇండోర్నుంచి లోక్సభకు ఎన్నిక అయ్యారు. అటల్బిహారీ వాజపేయి మంత్రివర్గంలో 2002 - 04 మధ్య కాలంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత లోక్సభలోని మహిళా సభ్యుల్లో పెద్ద వయస్కురాలు. అందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్న సుమిత్రా మహాజన్ ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం చూరగొన్న వ్యక్తి. అయితే విపక్షాలు ఆమె తటస్థతను పలు సార్లు ప్రశ్నించాయి. ఈమె అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తే మహారాష్ట్రలోని శివసేన, ఎన్సీపీ మద్దతు స్పష్టంగా పొందొచ్చునని చెప్తున్నారు.
దళిత నేతగా పరిశీలనలో థావర్ చంద్ గెహ్లాట్ పేరు
విదేశాంగ శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించిన రెండో మహిళ సుష్మ స్వరాజ్. ఏడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మూడుసార్లు అసెంబ్లీకి ఎనికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. 1977లో అతిపిన్నవయస్సులో తన 25వ ఏట హర్యానా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అన్ని పార్టీల్లో ఆమెకు మిత్రులు ఉన్నారు. విస్తృతస్థాయి ఏకాభిప్రాయ సాధనకు ఇది బీజేపీకి ఉపకరించవచ్చు. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన 68 సంవత్సరాల గెహ్లాట్ ప్రస్తుతం మోదీ సర్కారులో సామాజికన్యాయ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన పార్లమెంటరీ బోర్డులో ఉన్న ఏకైక దళిత నేత. ఆరెస్సెస్ నేపథ్యమున్న గెహ్లాట్ వివాద రహితుడు.