ఇలా కలిసొచ్చింది: కొత్త నోట్ల ముద్రణతో... ఆర్బీఐకి రూ.1000 కోట్లు ఆదా
నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్లు ముద్రించే ఖర్చులో రిజర్వ్ బ్యాంక్ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి రూ.1000 కోట్ల వరకు ఆదా అవనున్నట్లు తెలుస్తోంది.
ముంబై: పాత రూ.500, 1000 నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్లు ముద్రించే ఖర్చులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి రూ.1000 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్ఛ్ తన నివేదికలో వెల్లడించింది.
రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తవి తీసుకొచ్చే ప్రక్రియ(రీమోనటైజేషన్) పూర్తి చేసేందుకు, మార్చి 24 వరకు ముద్రించిన వాటికి అదనంగా మరో రూ.1.15 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లు మాత్రమే ముద్రించాల్సి ఉందని పేర్కొంది.

ఈ ప్రక్రియను ఏప్రిల్ రెండో అర్థభాగంలో ఆర్బీఐ పూర్తి చేసే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవస్థలో నుంచి తొలగించిన పూర్తి కరెన్సీ(రూ.15,55 లక్షల కోట్లు)ని ఆర్బీఐ ముద్రించాల్సిన అవసరం లేదు.
అసలు అవసరానికి మించి నగదు చలామణీలో ఉండటమే నోట్ల రద్దుకు మొదటి కారణం. ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండడంతో నగదుకు గిరాకీ తగ్గడం రెండో కారణమని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది.
పై అంశాలను పరిగణనలోనికి తీసుకుంటే రూ.1.17 లక్షల కోట్ల విలువైన నోట్లను ఆర్బీఐ ముద్రించాల్సిన అవసరం లేదని, దీనివల్ల రూ.500-1000 కోట్ల వరకు ఆర్బీఐకి ఆదా అవుతుందని వివరించింది.
డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం డిజిటల్ లావాదేవాల పరిమాణం దాదాపు రూ.2.3 లక్షల కోట్లు మాత్రమే. పరిమిత నగదు వినియోగ ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరాలంటే ఇది కనీసం రూ.3.5 లక్షల కోట్ల వరకు పెరగాల్సి ఉంటుందని తన నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది.












Click it and Unblock the Notifications