భారత్లో కోటీశ్వరులు సంఖ్య 60శాతానికి పెరిగింది: సీబీడీటీ
ఏడాదికి ఒక కోటి లేదా అంతకు మించి డబ్బులు సంపాదిస్తున్న టాక్స్ పేయర్ల సంఖ్య గత నాలుగేళ్లలో 1.40 లక్షలకు చేరిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది. అంతేకాదు పన్నులు కట్టే వారి సంఖ్య కూడా 60శాతానికి పెరిగిందని వెల్లడించింది. ఈ మేరకు కొన్ని కీలక గణాంకాలను సీబీడీటీ విడుదల చేసింది.
ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులకు సంబందించి కొన్ని కీలక గణాంకాలను సీబీడీటీ విడుదల చేసింది. కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్న వ్యక్తులు పన్ను కట్టడంలో 68శాతం వృద్ధి నమోదైందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. కోటి రూపాయలకంటే ఎక్కువగా సంపాదిస్తూ పన్ను కడుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయిందని వెల్లడించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 88,649 మంది వ్యక్తులు కోటి రూపాయలకు పైగా ఆదాయం రిటర్న్స్లో చూపగా... 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆ సంఖ్య 1,40,139కి చేరిందని అంటే దాదాపు 60శాతం వృద్ధిని నమోదు చేసిందని లెక్కలతో స్పష్టం చేసింది సీబీడీటీ.
ఈ గణాంకాలను చాలా జాగ్రత్తగా వడపోత చేసి చట్టసభల నుంచి, ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి గత నాలుగేళ్లలో సేకరించిన సమాచారం అని సీబీడీటీ ఛైర్మెన్ సుశీల్ చంద్ర తెలిపారు. అంతేకాదు గత నాలుగేళ్లలో టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య 80శాతం మేరా పెరిగిందని వివరించారు. అది 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.79 కోట్లుగా ఉండగా 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి అది 6.85 కోట్లకు చేరుకుందని స్పష్టం చేశారు.