ఒకప్పుడు టాప్ పోలీస్.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్: ఆమె కోసం బెంగాల్ జల్లెడ?
కోల్కతా: ఆమె ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్. మావోయిస్ట్ ప్రభావితం ప్రాంతం మిడ్నాపూర్లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. కానీ అదంతా గతం. అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఆమె ఆచూకీ అజ్ఞాతంగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె బెంగాల్ ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్. ఆమెనే భారతీ ఘోష్.
ఎవరీ భారతి ఘోష్:
నోట్ల రద్దు సమయంలో.. రద్దయిన నోట్లతో 375గ్రాముల బంగారం కొనుగోలు చేసినట్టు ఘోష్ పై ఆరోపణలున్నాయి. ఈ మేరకు పశ్చిమ మిడ్నాపూర్కు చెందిన ఘటల్ సబ్ డివిజనల్ కోర్టులో ఫిబ్రవరి 1న చందన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఆభరణాలు తీసుకుంది గానీ, దానికి సంబంధించిన నగదు మాత్రం చెల్లించలేదని ఘోష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇంటిపై దాడులు..:
చందన్ ఫిర్యాదు మేరకు గత నెల 7న పోలీసులు ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తర 24పర్ గనాస్ కి చెందిన యునల్ అలీ మండల్ అనే వ్యక్తి కూడా ఘోష్కు వ్యతిరేంగా ఫిర్యాదు చేశాడు.
ఈ రెండు ఫిర్యాదులతో ఘోష్ నివాసాలపై సీఐడీ తనిఖీలు చేపట్టింది. రూ.300 కోట్ల విలువైన 50 ఒరిజినల్ ల్యాండ్ సేల్ డీడ్స్, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, గోల్డ్ జువెల్లరీ, 57ఇంపోర్టెడ్ విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.
ఆస్తులు సీజ్:
ఘోష్ లాకర్స్లో 1.1 కేజీల గోల్డ్, రూ. 2 కోట్ల నగదు, కోల్కతా సమీపంలోని రూ.2.4 కోట్ల విలువ చేసే ఫ్లాట్ను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఘోష్ తో పాటు ఘటల్కు చెందిన సబ్ ఇన్పెక్టర్ రాథ్, అసిస్టెంట్ ఎస్ఐ దాస్, ఇద్దరు పోలీసు అధికారులు, ఘటల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ చిత్త పాల్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండం గమనార్హం.
సీఐడీపై విమర్శలు:
ఘోష్ తరఫు న్యాయవాది పినాకి భట్టాచర్య మాత్రం సీఐడీ తీరును తప్పుపడుతున్నారు. ఘోష్ ఆస్తుల లెక్కలని పక్కాగా ఉన్నాయని, ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆమె ఏ కొనుగోలు చేయలేదని అంటున్నారు. ఆమెపై కేసులు మోపడం రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. కేసులో సీఐడీ గెలవలేదని తేల్చి చెప్పారు.
ఘోష్ నేపథ్యం:
భారతీ ఘోష్ పోలీస్ ఆఫీసర్గా పలు అంతర్జాతీయ మిషన్లకు సేవలందించారు. ఐపీఎస్ గానూ ప్రమోట్ అయిన ఆమె మమతా సీఎం అయ్యాక సూపరిండెంట్ గానూ సేవలందించారు.
డిసెంబర్ 25న 3వ బెటాలియన్ రాష్ట్ర సాయుధ దళాలకు కమాండింగ్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. అనంతరం ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న 2నెలలకే ఆమెపై ఈ కేసు నమోదైంది.
ఆడియో మెసేజ్లపై ఫోకస్..:
ప్రస్తుతం ఘోష్ ఎక్కడున్నారనేది తెలియరావడం లేదు. అయితే మీడియాకు మాత్రం ఆమె ఆడియో సందేశాలను పంపుతున్నారు. ఈ ఆడియో మెసేజ్ లపై ప్రస్తుతం సీఐడీ ఫోకస్ చేసింది.
కాగా, సీనియర్ మావోయిస్ట్ నేత కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు ఎన్కౌంటర్కు సంబంధించిన కీలక సమాచారం కూడా ఆమె వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆచూకీ దొరికితే ఆ ఆధారాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.