అయోధ్యపై తీర్పు ఇచ్చిన సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్కు రాజ్యసభలో అవమానం: ప్రమాణం చేస్తుండగా.. !
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై చరిత్రలో నిలిచిపోయేలా తీర్పును వెలువడించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్. అయిదు శతాబ్దాలకు పైగా వివాదాల్లో నలుగుతూ, ఆపై న్యాయపరమై చిక్కుల్లో నానుతూ వచ్చిన అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించిన ఆయనకు రాజ్యసభలో ఘోర అవమానం ఎదురైంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
Recommended Video
హైకోర్టు జడ్జీలకు కేసుల పరిష్కారంలో చిట్కాలు చెప్పిన భారత ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన రంజన్ గొగొయ్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను పెద్దల సభకు ఎంపిక చేయడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ముందు నుంచీ విమర్శలు గుప్పించారు. దీన్ని క్విడ్ ప్రొ కో కింద అభివర్ణించారు. అయోధ్యపై ఒక వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ ఆయనకు తాయిలంగా ఈ పదవిని ఇచ్చిందటూ రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ధ్వజమెత్తారు.
రంజన్ గొగొయ్ ప్రమాణ స్వీకార సమయంలోనూ దాన్నే ప్రతిఫలింపజేశారు విపక్ష సభ్యులు. ఆయనను బాయ్కాట్ చేసినట్లు ప్రకటించారు. గొగొయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మూకుమ్మడిగా లేచి బయటికి వెళ్లిపోయారు. వాకౌట్ చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు. రాజ్యసభకు ఎంపిక చేయడం వెనుక ఏదో మతలబు ఉందని వ్యాఖ్యానించారు.
Members of opposition parties walk out from the House as Former Chief Justice of India Ranjan Gogoi takes oath as Rajya Sabha MP. https://t.co/HrtZ1vMrcP pic.twitter.com/UgITFNxREP
— ANI (@ANI) March 19, 2020
ప్రతిపక్ష సభ్యులు తీరును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పు పట్టారు. విభిన్న రంగాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం సంప్రదాయంగా వస్తోందని అన్నారు. అలాంటి ఆనవాయితీని తప్పు పట్టడంలో అర్థం లేదని మండిపడ్డారు. రంజన్ గొగొయ్ ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష సభ్యులు.. పరోక్షంగా రాష్ట్రపతిని తప్పు పట్టినట్టయిందని విమర్శించారు. గొగొయ్కు సభ్యత్వాన్ని కల్పించడం ద్వారా పెద్దల సభ పేరు సార్థకమైందని రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు.