పన్నీరు ధైర్యమేమిటి: ఆయన వెనక ఉన్నది వీరే...
పన్నీరు సెల్వం వెనక ఉన్నది కేంద్ర ప్రభుత్వమనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, పన్నీరు వెనక ఉండి కథ నడిపిస్తున్నదంతా సీనియర్లనే విషయం అర్థమవుతోంది.
చెన్నై: శశికళపై పోరాటంలో పన్నీరు వెనక ఉన్నది బిజెపి కేంద్ర నాయకత్వమనే అభిప్రాయం బలంగా ఉంది. నిజానికి, పన్నీరు సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు పెద్దగా లేదు. అయినా, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటానని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఆయన వెనక ఉంది బిజెపి అనే ప్రచారం ప్రబలంగా ఉన్నా అన్నాడియంకె సీనియర్ నేతలు ఆయనను ముందు పెట్టి శశికళపై పోరాటం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పన్నీరు సెల్వంతో పాటు శశికళ కూడా అమ్మ జయలలితకు సన్నిహితులే. అయితే, తాము ఎటు ఉండాలనే విషయంపై శాసనసభ్యులు సతమతమవుతున్నారని అంటున్నారు. కానీ, రిసార్టును వదిలి పన్నీరు వైపు వచ్చిన ఎమ్మెల్యేలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉన్నారు.
గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు చెన్నై వస్తే సంక్షోభం ముగుస్తుందని అందరూ భావించారు. కానీ పీటముడి వీడడం లేదు. మరింత రసవత్తరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇరు శిబిరాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి. పన్నీరు సెల్వం శశికళపై విజయం సాధిస్తాననే ధీమా వెనక సీనియర్ల అండదండలు, వారి రాజకీయ చాతుర్యం ఉన్నాయని అంటున్నారు.
పన్నీరు వెనక మొత్తం ఏడుగురు సీనియర్లు
ఏడుగురు అన్నాడీఎంకే సీనియర్ నాయయకులు పన్నీరును ముందు పెట్టి తెర వెనుక కథ నడిపిస్తున్నారని అంటున్నారు. తమ రాజకీయ అనుభవంతో శశికళపై సమరం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విభాగాన్ని ఎంచుకుని శశికళను నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. వారు వి.మైత్రేయన్, కెపి మునుస్వామి, కె.పాండిరాజన్, నాథమ్ ఆర్.విశ్వనాథన్, పీహెచ్.పాండ్యన్, ఈ.మధుసూదనన్, సీపాండ్యన్. ఎమ్మెల్యేలు దండిగా లేకున్నా పన్నీరు ముఖంలో చిరునవ్వు చెదరకపోవడానికి వారి అండదండలే కారణమని అంటున్నారు.
గవర్నరుతో సంప్రదింపుల విషయంలో ఆయన...
గవర్నర్తో సంప్రదింపులు, చర్చలకు సంబంధించిన అన్ని విషయాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై వి.మైత్రేయన్ పన్నీరు సెల్వంకు అండగా నిలుస్తున్నట్లు చెబుతున్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి వెలుగులోకి తేవాల్సిన అన్ని విషయాలపై కెపి.మునుస్వామి కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కెపాండిరాజన్ కూడా ఎమ్మెల్యేలతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా పన్నీరు శిబిరంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అంతర్గత వ్యూహాలపై వీరు...
పార్టీ అంతర్గత వ్యూహప్రతివ్యూహాలపై పన్నీరు సెల్వం తీసుకునే నిర్ణయాల వెనుక నాథమ్ ఆర్.విశ్వనాథన్ ఉన్నారని సమాచారం. పిహెచ్ పాండియన్రు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన తనకు రాజ్యాంగపరంగా ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కించగలడని పన్నీరు ధీమా అని చెబుతున్నారు. అన్నాడీఎంకేలో ఈ.మధుసూదన్కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయనకున్న పలుకుబడి తనకు ఉపయోగపడుతుందని పన్నీర్ సెల్వం నమ్ముతున్నారు.
సీనియర్ నేత పొన్నియన్ ఇలా..
న్యాయపరమైన విషయాలను అన్నాడీఎంకేలో సి.పొన్నయన్ చూస్తుంటారు. ఎంజీఆర్, జయలలిత ప్రభుత్వాన్ని నడిపించిన కాలంలో దాదాపు 16 సంవత్సరాలు ఆయన న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. ఈ అనుభవంతో తనకు ఎదురయ్యే న్యాయసంబంధ సమస్యల నుంచి పొన్నయన్ గట్టెక్కిస్తారని పన్నీరు ధీమాగా ఉన్నారు.