పారిపోయి హిజ్రాగా తిరిగొచ్చాడు: కొడుకును చూసి షాక్ తిన్న తల్లిదండ్రులు
మహిళగా మారాలనే ఉద్దేశంతోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. తన పేరు కీర్తనగా మార్చుకున్నానని ముత్తుకుమార్ తెలిపాడు.
అన్నానగర్: ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు రెండేళ్ల తర్వాత హిజ్రాగా మారి దర్శనమిచ్చాడు. హిజ్రాగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్నకుమారుడ ముత్తుకుమార్(20) తిరువూర్ లోని బనియన్ సంస్థలో పనిచేసేవాడు. ఇదే క్రమంలో మార్చి, 2015 నెలలో అతను ఒక్కసారిగా మాయమైపోయాడు. పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అతను మళ్లీ తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి వారు ముత్తుకుమార్ కోసం వెతుకుతూనే ఉన్నారు.
తాజాగా చెన్నైలోని వ్యాసర్ పాడిలో ముత్తుకుమార్ ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే అతను హిజ్రాగా మారిపోయాడు. మహిళగా మారాలనే ఉద్దేశంతోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. తన పేరు కీర్తనగా మార్చుకున్నానని, చెన్నైలో తెలిసిన వ్యక్తి సహాయంతో మదురై వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానని పోలీసులకు వివరించాడు.
అనంతరం ముత్తుకుమార్ ఆచూకీ దొరికిందని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు కబురుపెట్టారు. సంతోషంతో అక్కడికెళ్లిన తల్లిదండ్రులు చీరలో ఉన్న కుమారుడిని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొడుకును అలా చూసి వారి నోటవెంట మాట రాలేదు. అనంతరం ముత్తుకుమార్ ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ముత్తుకుమార్ తనకు నచ్చినట్లుగా ఉండవచ్చునని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు విచారణ తర్వాత అతను తల్లిదండ్రులతో కలిసి చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం.