సంచలనం: 'పటేళ్లకు ఎప్పటికీ రిజర్వేషన్లు దక్కవు'
న్యూఢిల్లీ: తమని ఓబీసీల్లో చేర్చాలంటూ గుజరాత్లో పటేళ్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాల్లో పటేళ్లకు ఎప్పటికీ రిజర్వేషన్లు దక్కే అవకాశాళు ఎంతమాత్రం లేదని ఆయన తెలిపారు.
రిజర్వేషన్ల కోసం పటేళ్లు చేస్తున్న ఆందోళన ఎప్పటికీ నెరవేరబోదని ఆయన పేర్కొన్నారు. భారత్లో కుల రాజకీయాలను ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయన్న ఆయన, బీహార్లో జరిగే ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

జనతా కూటమి నుంచి వైదొలగిన సమాజ్వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ తిరిగి తమతో కలుస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన తనకు బాగా తెలుసునని, మత రాజకీయాలపై పోరుకు తన జీవితాన్నే అంకితం చేశారని అన్నారు.
గుజరాత్లో జరుగుతున్న పటేళ్ల ఉద్యమం వెనుక రాజకీయ శక్తులున్నాయని, త్వరలోనే వారెవరన్నది బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పటేళ్ల ఆందోళనల వెనుక ఆర్ఎస్ఎస్ ఉందా? లేక బీజేపీయే స్వయంగా ఇదంతా చేయిస్తుందా? అన్న విషయాలపై తాను వ్యాఖ్యానించబోనని అన్నారు.
భారత రాజ్యాంగంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పిన ఆయన, ప్రపంచంలోనే అగ్రకులాల్లో పటేల్ కులం ఒకటని, వీరిలో చాలా మంది అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారని, గుజరాత్ లోని వ్యాపారంలో అత్యధిక భాగం వీరి చేతుల్లోనే నడుస్తోందని శరద్ యాదవ్ అన్నారు.












Click it and Unblock the Notifications