సల్విందర్పై 8గం.లు ప్రశ్నల వర్షం, పాక్లో నో రిజిస్టర్!
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడి ఘటనకు ముందు ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సోమవారం మళ్లీ విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది.
పరస్పర విరుద్ధ సమాధానాలు చెబుతున్న ఆయనను సత్యశోధన పరీక్ష నిమిత్తం పంపించే అవకాశాన్ని అధికార వర్గాలు కొట్టివేయడం లేదు. సల్వీందర్ సింగ్ వద్ద వంట మనిషిగా ఉన్న మదన్ గోపాల్కూ ఎన్ఐఎ సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఈ నెల 13న హాజరు కావాలని చెప్పింది.
పాక్ ప్రాథమిక నివేదిక: ఉగ్ర నెంబర్లు రిజిష్టర్ కాలేదని వెల్లడి!
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్థాన్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం ఉదయం ఐబీ, ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్ఐఏ, స్థానిక పోలీసులతో కలిపి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు.
వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన దర్యాప్తు బృందం మూడు జిల్లాల్లో ముమ్మర సోదాలు చేసింది. సోదాల్లో భాగంగా పదుల సంఖ్యలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు కింది స్థాయి అధికారులు సోదాలు చేస్తుంటే, ఉన్నతాధికారులు సాంకేతికాంశాలపై సమీక్షస్తున్నారు.
అంతేకాక తాము నిర్వహిస్తున్న దర్యాప్తునకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా రూపొందించారు. సదరు నివేదికను వారు భారత్ కు అందజేశారు.
పఠాన్ కోట్ నుంచి ఉగ్రవాదులు పాక్ లోని తమ కుటుంబాలు, వారి బాసులతో మాట్లాడారని భారత్ చెబుతున్న ఫోన్ నెంబర్లు తమ దేశంలో రిజిష్టర్ కాలేదని ఆ నివేదికలో పాక్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అంతేకాక తమ దేశంలో రిజిష్టర్ కాని నెంబర్లను తాము ట్రేస్ చేసే అవకాశాలు కూడా లేవని చెప్పిందని తెలుస్తోంది.