ఓబీసీ రిజర్వేషన్ కోసం పటేళ్ల ఆందోళన.. పాటిదార్లలో చీలికకు బీజేపీ యత్నాలు
గుజరాత్ రాష్ట్రంలో కీలకమైన పాటిదార్లు దూరమవుతున్న సంకేతాలు కనిపించడంతో ఆ సామాజిక వర్గంలో చీలికలు తేవడానికి అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ పరిణమాలు వేగంగా మారుతున్నాయి. 1990వ దశకం నుంచి కమలనాథులకు వెనుదన్నుగా నిలిచిన పటేళ్లు.. విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ చేపట్టిన ఆందోళన రెండేళ్ల క్రితం ఉధ్రుతంగా సాగింది. ఈ ఆందోళన కమలనాథులకు పాటిదార్లను దూరం చేసింది. గుజరాత్లో బలమైన సామాజిక వర్గం పటేళ్లు. ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి, ఆరు నెలల పాటు రాష్ట్ర బహిష్కరణ వేటేసింది. అంతే కాదు పాటిదార్లపై దమనకాండ అమలుజేసిన ప్రభుత్వం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.
హార్దిక్ పటేల్ సారథ్యంలో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునివ్వడం అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఈ క్రమంలో పాటిదార్లలో, పాటిదార్ల సంఘాల్లో, సంస్థల్లో విభేదాలు స్రుష్టించడానికి వెనుకాడటం లేదు. రకరకాల ప్రలోభాలు కల్పిస్తూ పాటిదార్లలో చీలికలు తేవడం ద్వారా కొంత భాగమైనా ఓట్లు పొందాలని కమలనాథులు తలపోస్తున్నారు.
చీలిపోయిన విశ్వ ఉమియా ఫౌండేషన్ కీలకం
తొలుత హార్దిక్కు వ్యతిరేకంగా పాటిదార్ అరక్షణ్ ఆందోళన్ సమితి (పాస్) జాతీయ కన్వీనర్ అశ్విన్ పటేల్ ధిక్కార స్వరం వినిపించారు. తాజాగా హార్దిక్ పటేల్పై పాటిదార్ల సామాజిక, ఆధ్యాత్మిక ట్రస్ట్ అయిన విశ్వ ఉమియా ఫౌండేషన్ చీలిపోయింది. ఈ ఫౌండేషన్లో 500 ట్రస్టీల్లో సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్పీజీ) నాయకుడు నచికేట్ ముఖీ ఒకరు. ఇటీవలి వరకు హార్దిక్ పటేల్కు మద్దతు పలికిన నచికేట్ ముఖీ.. తాజాగా దీన్ని ప్రైవేట్ ఆందోళనగా అభివర్ణించారు.
ఆందోళనలో బీజేపీ అనుకూలురు కూడా?
తాజాగా ఎస్పీజీ నాయకుడు నచికేట్ ముఖీ మాట్లాడుతూ కొందరు పాటిదార్లు హార్దిక్ ఆధ్వర్యంలో సాగుతున్న ఆందోళనకు కొందరు పాటిదార్లు మాత్రమే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. కానీ ఈ ఆందోళనతోనే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టగలమని భావిస్తూ, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నచికేట్ ముఖీ తెలిపారు. ‘హార్దిక్ పటేల్, లాల్జీ పటేల్ తదితరుల సారథ్యంలో సాగిన ఓబీసీ రిజర్వేషన్ కోటా ఆందోళన కోసం పాటిదార్లు మద్దతు పలికారు. కానీ కొందరు మాత్రం బీజేపీతో అసొసియేట్ అయిన వారు ఆందోళనను వ్యతిరేకిస్తున్నారు. మేం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన సాగించాలని భావిస్తున్నాం' అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తర్వాత మాట మారిస్తే భవితవ్యం ఏమిటి?
కొత్తగా ఏర్పాటైన పాటిదార్ కోర్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు సీకే పటేల్ స్పందిస్తూ హార్దిక్ పటేల్ ప్రైవేట్ ఆందోళన సాగిస్తున్నాడని, ఓబీసీ రిజర్వేషన్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రిజర్వేషన్ల కోసం పోరాడినంత కాలం తాము అతడితోనే ఉన్నామని, కానీ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్ అంగీకరించకుంటే పరిస్థితి ఏమిటన్నారు. రిజర్వేషన్ పేరుతో రాజకీయాలు చేయడం సరి కాదని సికే పటేల్ తెలిపారు.
విరాళాలే ఇవ్వని నచికేటి ముఖి కబుర్లు చెప్పడమా?
విశ్వ ఉమియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆర్ఆర్ పటేల్ మాట్లాడుతూ నచకేటి ముఖీ తమ సంస్థ ట్రస్టీ సభ్యుడే కాదని వాదించారు. రిజర్వేషన్ల ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పలు పాటిదార్ సంఘాలు భూరీ విరాళాలిచ్చాయని చెప్పారు. కానీ నచికేటి ముఖీ సింగిల్ పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాని పాటిదార్ల రిజర్వేషన్ కోసం హార్దిక్ పటేల్ సొంత రాజకీయం నడుపుతున్నారన్నారు. పటేళ్లు ఎవరికి ఓటేయాలో ఆయన చెప్పలేరని స్పష్టం చేశారు.
సాంకేతిక కారణాలతోనే పరిహారం చెల్లింపునకు నిరాకరణ
పాటిదార్ యూత్ బ్రిగేడ్, సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్పీజీ) గ్రూప్ నేత దిలీప్ పటేల్ మాట్లాడుతూ హార్దిక్ పటేల్ డిమాండ్లతో తమకు సంబంధం లేదన్నారు. పది రోజుల క్రితం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని గుర్తు చేశారు. ఈ చర్చల్లో పలు సంస్థలు, వ్యాపారుల ప్రతినిధులు పాల్గొన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఆందోళనలో మరణించిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయమై అంగీకారం కుదరలేదు. ప్రభుత్వం తన పరిధిలో చేయగలిగింది, చేయలేనిది చెప్పేసిందని గుర్తు చేశారు.
ఏ పార్టీ ఓబీసీ రిజర్వేషన్ కల్పించలేదన్న ఉమియా ఫౌండేషన్ ట్రస్టీ
కాగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ పాటిదార్లకు చెందిన సంస్థల్లో ఉన్జిహాలోని ఉమియాధామ్, రాజ్ కోట్ జిల్లా కాగ్వాడ్ ఖోదాల్ ధామ్ సంస్థలు చాలా కీలకం అని తెలిపారు. ఈ రెండు ట్రస్టులపైనే పాటిదార్లకు విశ్వాసం ఉంటుందన్నారు. మిగతా కొన్ని సంస్థలు చేసే ఆరోపణల విలువ చాలా పరిమితం అని చెప్పారు. విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీ సంజయ్ పటేల్ మాట్లాడుతూ ఏ పార్టీ కూడా ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ కల్పించలేదని పేర్కొన్నారు.