పూర్తి మెజార్టీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాం, మహాత్ముడు-అంబేడ్కర్ ఏమన్నారంటే: మోడీ
న్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అవినీతిపరులకు నాడు అండగా ఉంటే, తాము ఆ అవినీతిపరులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎంతగా అడ్డుకుంటే తాను అంత దృఢంగా పని చేస్తానని చెప్పారు. సంపూర్ణ మెజార్టీ ఇస్తే ప్రభుత్వం ఎలా పని చేస్తుందే ప్రజలు చూశారని చెప్పారు. ప్రజలు ఈ నాలుగున్నరేళ్ల ఎన్డీయే పాలనను చూశారని చెప్పారు. ప్రజలకు విపక్షాల కూటమి అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల కోల్కతాలో ఏకమైన పార్టీలను ప్రజలు కోరుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్మీని అవమానిస్తోందని మోడీ మండిపడ్డారు ఆర్మీ చీఫ్ను గూండాగా అభివర్ణించారని వాపోయారు. ఎన్నో కట్టు కథలు అల్లారని చెప్పారు. ఆర్మీ బలపడటం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ సమయంలో కాంగ్రెస్ పార్టీ సంపాదనపై ఆసక్తి చూపారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి డీల్ వెనుక మధ్యవర్తి ఉండేవారని ఆరోపించారు.
మన చుట్టుపక్కల దేశాలు ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం ఇన్నేళ్ల పాటు ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ అన్నారు. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది తన నినాదం కాదని, మహాత్మా గాంధీ నినాదం అని చెప్పారు. స్వాతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్ముడు చెప్పారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు, నేను చేసిన నేరం అదే: లోకసభలో ప్రధాని మోడీ
కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని అన్నారు. వేలాది విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని, తాము పారదర్శకత కోరుతున్నామని చెప్పారు. పారదర్శకత కోరడంతో పలు సంస్థలు మూతపడ్డాయని చెప్పారు. లెక్క లేకుండా విదేశాల నుంచి అంత డబ్బు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. అవినీతిపరులు, దోపిడీదారులను సహించేది లేదని చెప్పారు. ఆధార్ వ్యవస్థ ద్వారా అవినీతిపరుల ఆట కట్టిస్తున్నామని చెప్పారు.
ధరల పెరుగుదల, కాంగ్రెస్ ఒకే జట్టు అని ఎద్దేవా చేశారు. అలాగే ద్రవ్యోల్భణానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధం ఉందని సెటైర్ వేశారు. ప్రజలకు సరైన వైద్యం, సరైన ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. అందుకే స్టంట్స్, సర్జరీలు, మెడిసిన్స్ ధరలు తగ్గాయని చెప్పారు. ఇది పేదలకు ఉపయోగకరంగా ఉందని చెప్పారు.