షీనా బోరా హత్య: పీటర్ ముఖార్జియా అరెస్టు
ముంబై: ముంబైలో సంచనలం రేపిన షీనా బోరా హత్య కేసులో సిబిఐ అధికారులు ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా భర్త, మీడియా దిగ్గజం పీటర్ ముఖార్జియాను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. షీనా బొరా (24) మృతదేహం ముంబై సమీపంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన విషయం తెలిసిందే. పీటర్ ముఖార్జియాను శుక్రవారం కోర్టులో ప్రవేశపెడుతారు.
షీనా బోరాను ఇంద్రాణి చంపేసి, రాత్రి ఇంట్లోనే ఉంచినట్లు, ఆ సమాచారాన్ని పీటర్ ముఖార్జియాకు ఇచ్చినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. పీటర్ ముఖార్జియాకు షీనా బొరా హత్య గురించి ముందే తెలిసినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. రాత్రి ఇంట్లో ఉంచిన శవాన్ని మర్నాడు రాయగఢ్ అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు.
షీనా బొరా హత్య కేసులో సిబిఐ గురువారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. 2012 ఏప్రిల్ నెలలో షీనాబోరా హత్యకు గురైంది. షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీయా, సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ సింగ్లను నిందితులుగా చేరుస్తూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ముంబై నగర శివార్లలోని రాయ్ గఢ్ అటవి ప్రాంతంలో లభ్యం అయిన మృతదేహం షీనాబోరాదే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. వేయి పేజీలకు పైగా చార్జిషీట్ను సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.
చార్జిషీట్లో 150 మంది సాక్షుల వాంగ్మూలాలు, 200 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఏడు వాంగ్మూలాలను మిజెస్ట్రేట్ ముందు రికార్డు చేశారు. షీనా బోరా హత్య కేసును అప్పటి ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా స్వయంగా పర్యవేక్షించారు. ఆ తర్వాత కేసును సిబిఐకి అప్పగించారు.