విశాఖ దిశగా మరింత బలపడిన ఫైలిన్, తీవ్ర తుఫానుగా
హైదరాబాద్/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుఫాను మరింత బలపడింది. ఇది తీవ్రరూపం దాల్చి పెను తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
అన్ని ఓడ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్డులలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఫైలిన్ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే తీర ప్రాంతాలకు చేరుకున్న డిసాస్టర్ మేనేజ్మంట్ బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఫైలిన్ ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారినట్లు వాతవారణ శాఖ అధికారులు చెప్పారు. ఒడిస్సాలోని గోపాల్పూర్ వద్ద ఈ నెల 12వ రాత్రి మరింత తీవ్ర తుఫాను తీరం దాటనుంది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాను రానుందని తెలిపారు. ఫైలిన్ కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ కారణంగా అత్యవసర సేవ విభాగం ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. మత్స్యకారుల గ్రామాలతో విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 25 మత్స్యకార గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఫైలిన్ ప్రభావం ఒడిశాలోని పది జిల్లాలతో పాటు ఎపిలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ప్రభావం పడుతుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన్ కారణంగా గంటకు 170 నుండి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
పారాదీప్కు ఆగ్నేయ ప్రాంతంలో 820 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో 870 కిలోమీటర్ల దూరంలో, విశాఖ తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో 900 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సూచించారు. కేంద్ర బలగాల సహకారం కోరినట్లు చెప్పారు.