మన్మోహన్ దేశభక్తిని మేం శంకించడం లేదు: రాజ్యసభలో జైట్లీ, శాంతించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ తక్కువ చేసి మాట్లాడలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు.
గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటున్నదని, మాజీ ప్రధానితో పాటు ఇతర నేతలు కూడా ఆ కుట్రలో పాలుపంచుకుంటున్నారని ఇటీవల ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంతో ఆ అంశాన్ని పార్లమెంట్లో కొన్ని రోజులుగా విపక్షాలు లేవనెత్తుతూనే ఉన్నాయి.
ప్రధాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని విపక్షాలు ఉభయసభలను స్తంభింపచేశాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో అరుణ్ జైట్లీ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ నైతికతను ప్రధాని మోడీ ప్రశ్నించలేదని తెలిపారు.

మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీలను అత్యున్నతంగా గుర్తిస్తామన్నారు. వారిని అత్యున్నతంగా గౌరవిస్తామని, వారి దేశభక్తిని శంకించడంలేదని జైట్లీ స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చినందుకు ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, వాటిని వెనక్కి తీసుకుంటున్నామని, ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని భావిస్తున్నామని ఆజాద్ తెలిపారు.












Click it and Unblock the Notifications