ఊచకోత మరచి నీతులా?: కాంగ్రెస్పై మోడీ ఫైర్
పాట్నాం దేశంలో అసహన వాతావరణం పెరిగిపోతోందంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో సిక్కులపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ.. ఎన్డీయేపై నేడు కాంగ్రెస్ విమర్శలకు పాల్పడే బదులు ఆనాటి సిక్కుల ఊచకోతకు సిగ్గుతో తలదించుకోవాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీహార్లోని సీమాంచల్ రీజియన్లో గల పూర్ణియాలో ఒక ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ రోజు నవంబర్ రెండో తేది. 1984నాటి సంఘటనలు గుర్తున్నాయా? ఇందిరాగాంధీ దారుణహత్య తర్వాత రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఢిల్లీలో, దేశవ్యాప్తంగాగల ఇతర ప్రాంతాల్లో లక్షలాది సిక్కులను ఊచకోత కోశారు. ఊచకోతలకు సంబంధించి కాంగ్రెస్, దాని నాయకులకు వ్యతిరేకంగా తీవ్రమైన అభియోగాలున్నాయి. ఈరోజు సరిగ్గా అదే రోజు కాంగ్రెస్ పార్టీ అసహనంపై ఉపన్యాసాలు ఇస్తోంది' అన్నారు.
‘సిక్కుల కళ్లలోని నీరు ఇంకా ఆరనేలేదు. వారి గాయాలు ఇంకా మాననేలేదు. మీరు మాత్రం అదే నవంబర్ 2న నాటకాలాడుతున్నారు' అని మోడీ కాంగ్రెస్ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రపతిని కలిసి దేశంలో పెరుగుతున్న అసహనం గురించి వివరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాలు ఇచ్చిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ 40 స్థానాల్లోనూ బిజెపి అభ్యర్థులే సులభంగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘లాలూ జీ, నితీశ్ జీ ఇద్దరూ చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వాళ్లకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడినట్టు ఉంది. అందుకే రాష్ట్రంలో ఉనికి కూడా లేని కాంగ్రెస్ పార్టీకి 40సీట్లు ఇచ్చారు. ఇందుకోసం వారిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మిగతా సీట్ల కోసం నేను ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని మోడీ అన్నారు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆశీర్వాదాల వల్లే నితీశ్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగారని మోడీ వ్యాఖ్యానించారు. ‘‘జంగిల్ రాజ్' పట్ల నిరాశానిస్పృహలకు గురైన రాష్ట్ర ప్రజలు దాని నుంచి విముక్తిని కోరుకున్నారు. వాజపేయి సామర్థ్యం గురించి వారికి తెలుసు. అందువల్ల వారు మీకు ఓట్లేశారు' అని ఆయన నితీశ్ కుమార్ను ఉద్దేశించి అన్నారు.
‘ఇప్పుడు మీకు వాజపేయి ఆశీస్సులు లేవు. అందువల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మరు' అని మోడీ చెప్పారు. తన ఎన్నికల పర్యటనలు చూస్తే మహాకూటమి నేతలకు వణుకు పుడుతోందని అన్నారు. బీహార్లో బిజెపి విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.