ఘాటు లేఖ: నల్లడబ్బుపై జైట్లీని ఉతికేసిన జెఠ్మలానీ
దీనిపై ఆయన నేరుగా జైట్లీకే మూడు పేజీల లేఖాస్త్రం సంధించారు. నల్లధనంపై నిజాలు బయటపెట్టడం జైట్లీకి ఇష్టంలేదని, మోడీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారనే సంకేతాలు పంపేందుకే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. మోడీ అంటే జైట్లీకి గిట్టదని, మోడీ ప్రధాని కావడం ఇష్టంలేదని ఆయన అన్నారు. ప్రధాని పీఠంపై జైట్లీ కన్నేశారని ఆయన వ్యాఖ్యానించారు.
అరుణ్ జైట్లీ ఇటీవలే ఆస్పత్రిలో చేరి మృత్యువు కోరల నుంచి త్రుటిలో బయటపడ్డారని, ఆ తర్వాతైనా నైతికతతో ప్రవర్తించి ఉంటే బాగుండేదని జెఠ్మలానీ అన్నారు. నల్లధనం విషయంలో జైట్లీ తీరు దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. ద్వంద్వ పన్నులను నివారించే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లవుతుంది కాబట్టే నల్లధనం దాచుకున్న వారి పేర్లను బయటపెట్టడంలేదని జైట్లీ చేసిన వాదనను జెఠ్మలానీ తప్పుపట్టారు.
జర్మనీ ఎప్పుడూ ఈ ఒప్పందం గురించి మాట్లాడలేదని, నల్ల కుబేరుల గురించి ఎలాంటి సమాచారం ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్పై ఆర్థిక మంత్రికి ఎవరో తప్పుడు సలహా ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీపావళి రోజు మీకు ఈ లేఖ రాయడం బాధాకరంగా ఉందని ప్రారంభించి ఆయన నల్లధనం కేసు వివరాల్లోకి వెళ్తూ అరుణ్ జైట్లీకి జెఠ్మలానీ లేఖ రాశారు. లేఖపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, భారత పౌరుడిగా తాను ఆ పనిచేశానని ఆయన జవాబిచ్చారు. తాను బిజెపిని లెక్క చేయబోనని, భారత పౌరులనే పట్టించుకుంటానని, అది ప్రజల డబ్బు అని ఆయన అన్నారు.