ఐసిస్ లింక్: టెక్కీ సల్మాన్కు పది రోజుల పోలీసు కస్టడీ
హైదరాబాద్: ఐసిస్ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న సల్మాన్ మొహినుద్దీన్ను 10 రోజులు పోలీస్ కస్టడీ అప్పగిస్తూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ను పలు కీలక అంశాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని రెండు వారాల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును శంషాబాద్ పోలీసులు అభ్యర్థించారు. పోలీసుల దరఖాస్తును పరిగణలోకి తీసుకున్న కోర్టు కేవలం 10 రోజుల పోలీస్ కస్టడీకి అంగీకరించింది.
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లో పుట్టి, పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన సల్మాన్ మొయినుద్దీన్ అనే ఇంజనీర్ సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లోకి చేరేందుకు బయల్దేరి పోలీసులకు ఇటీవల చిక్కిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్కు చేరుకుని అక్కడి నుంచి తన గర్ల్ఫ్రెండ్తో సహా టర్కీ మీదుగా సిరియా చెక్కేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుని శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.
అతని వద్ద నుంచి లాప్టాప్, రెండు సెల్ఫోన్లు, పాస్పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సామాజిక వెబ్సైట్ల ద్వారా ఐఎస్ ఉగ్రవాద సంస్థ అనుకూల ప్రచారం చేస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అతడి ప్రణాళికలు బయటపడ్డాయి. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. హైదరాబాద్లోని బజార్ఘట్కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ (32) బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడ టెక్సాస్లోని ఓ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాడు.
ఆ సమయంలో అతడికి బ్రిటన్కు చెందిన నికీ జోసెఫ్ అలియాస్ నిక్కి నికోలా అలియాస్ అయేషా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అయేషా అమెరికాలో ఓ వైద్యుడిని వివాహం చేసుకొని ఇస్లామిక్ కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకొని ఇస్లాంలోకి మారిపోయింది. సల్మాన్తో పరిచయాన్ని పెంచుకొన్న ఆమె అతడికి కొందరు ఇస్లామిక్ ప్రముఖులతో పరిచయం చేసింది. వారి మాటలతో సల్మాన్ ఐఎస్ఐఎస్ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ ఉగ్రవాద సంస్థ రోజురోజుకూ బలం పుంజుకుంటుండడంతో ఆయేషా, మొయినుద్దీన్ మారుపేర్లతో ఫేస్బుక్ గ్రూప్స్ను ఏర్పాటు చేసి ఐఎస్ అనుకూల ప్రచారం సాగించడం మొదలుపెట్టారు.
తమలాంటి భావాలే ఉండి, స్పందించినవారు ఐఎస్ఐఎస్ కోసం పనిచేసేలా ఆకర్షించేవారు. అయితే, అమెరికాలోనే ఉండేందుకు నిరుడు నవంబర్లో మొయినుద్దీన్ దరఖాస్తు చేసుకోగా అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో, అతడు హైదరాబాద్కు చేరుకున్నాడు. ఇక్కడా సామాజిక సైట్ల ద్వారా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై నిఘా వేశారు. ఈ క్రమంలో అతడికి సిరియాకు చెందిన అబుఅల్బరా అల్సమి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూపలుమార్లు నెట్లో మాట్లాడుకున్నారు.
అబుఅల్బరా ఆహ్వానం మేరకు సిరియాకు వెళ్లేందుకు మొయినుద్దీన్ సిద్ధమయ్యాడు. ముందుగా దుబాయ్కు వెళ్లి అక్కడ అయేషాను కలుసుకొని ఇద్దరూ కలిసి టర్కీ మీదుగా సిరియాకు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే.. అబు అల్బరాతో మొయినుద్దీన్ ఆన్లైన్లో సంప్రదింపులు జరిపినప్పటి నుంచీ పోలీసులు మొయినుద్దీన్పై నిఘా పెంచారు.
అతడి ప్లాన్ ముందే తెలిసిపోవడంతో దుబాయ్కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే అతణ్ని అరెస్టు చేశారు. విచారణలో మొయినుద్దీన్ తన నేరాలను అంగీకరించినట్టు ఏసీపీ సుదర్శన్ తెలిపారు. మొయినుద్దీన్ పేస్బుక్లో ఏర్పాటు చేసిన గ్రూపులో 188 మంది సభ్యులను చేర్చుకున్నాడని తెలిపారు. కాగా తన కొడుకు నిర్దోషి అని మొయినుద్దీన్ తండ్రి హమీద్ మొయినుద్దీన్ మీడియాకు తెలిపారు.