రేపిస్టు, సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష భయం
బెంగళూరు: వికృత కామాంధుడు, సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డి అలియాస్ బీ.ఏ. ఉమేష్ కు ఉరిశిక్ష భయం పట్టుకుంది. చివరి అవకాశంతో తాను ఉరి శిక్ష నుంచి తప్పించుకుంటానని ఉమేష్ రెడ్డి ఆశగా ఎదురు చూస్తున్నాడు.
అయితే ఉమేష్ రెడ్డిని ఉరి తియ్యాలని అతని బాధితులు కోర్టుకు మనవి చేస్తున్నారు. తనకు ఉరి శిక్ష రద్దు చేసి యావజ్జీవ శిక్ష విధించాలని ఉమేష్ రెడ్డి హై కోర్టులో అర్జీ సమర్పించాడు. ఉమేష్ రెడ్డి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసేవాడు.
ఇతని వికృత చేష్టలు బయటపడటంతో సస్పెండ్ చేశారు. తరువాత ఒంటరిగా కనపడిన మహిళలు, యువతుల మీద అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశాడు. వారి దగ్గర ఉన్న బంగారు నగలతో పరారైనాడు.
ఇప్పటి వరకు ఇతని మీద 23 అత్యాచారాలు, హత్యలు, దోపిడీల కేసులు నమోదు అయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వివిధ కేసుల్లో న్యాయస్థానం ఇతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఒక కేసులో ఇతనికి ఉరి శిక్ష పడింది. ఇప్పటికే ఇతను 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తనకు క్షమాభిక్ష పెట్టాలని హోం శాఖకు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఇతని క్షమాభిక్ష అర్జీని తిరస్కరించిన హోం శాఖ రాష్ట్రపతి, గవర్నర్ లకు క్షమాభిక్ష అర్జీ పెట్టుకోవాలని సూచించింది.
ఉమేష్ రెడ్డి పెట్టుకున్న అర్జీని రాష్ట్రపతి, గవర్నర్ ఇంకా పరిశీలించలేదని, అంత వరకు ఉరిశిక్షను తాత్కాలికంగా రద్దు చేయాలని ఇతని న్యాయవాది ప్రొఫసర్ రవివర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని సూచించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలోని బెళగావిలోని హిండలగా జైలులో ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష విధించడానికి అన్నీ సిద్దం చేశారు. చివరి అవకాశంగా ఉమేష్ రెడ్డి కర్ణాటక హై కోర్టును ఆశ్రయించాడు.
అక్టోబర్ 18వ తేది మంగళవారం కర్ణాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఉమేష్ రెడ్డి పెట్టుకున్న అర్జీని పరిశీలించి తీర్పు చెప్పనుంది. ఉమేష్ రెడ్డికి కానిస్టేబుల్ గా పని చేస్తున్నప్పటి నుంచే నేర చరిత్ర ఉంది.