చావొద్దు! శత్రువుని చంపండి: సైన్యానికి పారికర్
పనాజీ: సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉండటమే కాదు, శత్రువులను హతమార్చాలని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సైనికుడు సిద్ధంగా ఉండాలన్న అభిప్రాయానికి నేను వ్యతిరేకం. సైనికుడు ఎందుకు చావడం? అతడు చావొద్దు. శత్రువును హతమార్చాలి' అని చెప్పారు.
అంతేగాక, ‘అలా చేస్తే.. ఒక్క ఏడాదిలోనే ఫలితం కనిపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో ఇండో-మయన్మార్ సరిహద్దులో తిరుగుబాటుదారుల దాడిలో భారత సైనికులు చనిపోయిన మూడు గంటల్లోనే సమావేశమయ్యాం. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మద్దతు కూడా లభించింది. మొత్తం ఆపరేషన్ను రహస్యంగా పూర్తిచేశాం. నేను భద్రత లేకుండానే బయటికి వెళ్లేందుకు ఇష్టపడతా. భద్రత ఉన్నా.. అన్నిసార్లూ సురక్షితమని చెప్పలేం' అని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు.
8 రాష్ట్రాల్లో హై అలర్ట్
మరోసారి దేశంలోని పలు రాష్ట్రాలపై ఉగ్రవాదులు పంజా విసిరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అనేక కోణాల నుంచి సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా ఇంటిలిజెన్స్ సంస్థలు ఈమేరకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ సహా మొత్తం 8 రాష్ట్రాలపై ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్త అలెర్ట్ ప్రకటించాయి.
కీలక రాష్ట్రాలపైనే కాకుండా దేశంలో మతకల్లోలం సృష్టించే లక్ష్యంతో ప్రార్థనా స్థలాలపై కూడా ఉగ్రవాద మూకలు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించాయి. పర్యాటకంగా కూడా ఇప్పుడిప్పుడే బలపడుతున్న భారత్లో ఆ అవకాశాలు దెబ్బతీయాలన్న వ్యూహం కూడా ఉగ్రవాదుల దాడుల యోచన వెనకు ఉందని పేర్కొన్నాయి.
ఇందులో భాగంగా మత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలపైనా, టూరిస్ట్ కేంద్రాలపైన కూడా వీరు విరుచుకుపడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. జైపూర్, అజ్మీర్, జోధ్పూర్, సిఖార్ వంటి టూరిస్ట్ స్థావరాలపై ఈ ముష్కర మూకలు గురిపెట్టినట్టుగా తమకు కీలక సమాచారం అందినట్టు ఇంటిలిజెన్స్ బ్యూరో వర్గాలు తెలిపాయి. ముందస్తుగానే అన్ని జన సమ్మర్థ ప్రాంతాల్లోనూ, ప్రార్థనా స్థలాల్లోనూ, టూరిస్ట్ కేంద్రాల్లో కూడా గరిష్టస్థాయిలో అప్రమత్తతను ప్రకటించినట్టు తెలిపాయి.