మన్మోహన్కు సోనియా విందు, బాసట: దిగ్విజయ్ ధీమా
న్యూఢిల్లీ/బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో యుపిఏ కూటమి ఓటమి దిశగా పయనిస్తోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బాసటగా నిలిచారు. యుపిఎ ఓటమికి మన్మోహన్ సింగ్ను మాత్రమే బాధ్యుడ్ని చేయరాదని, అది ఎంతమాత్రం మంచిది కాదని పార్టీ నాయకులకు ఆమె హితవు పలికినట్లు తెలిసింది. ఆయనకు మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు అండగా నిలబడాలని సూచించారు.
పదేళ్ల యుపిఏ హయాంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్కు సోనియా గాంధీ బుధవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసం 10 జన్పథ్లో విందు ఇచ్చారు. విందుకు హాజరైన నాయకులకు, మంత్రులకు ఆమె పైవిధంగా దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పదేళ్లపాటు ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు నిర్వహించటంతోపాటు కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడారని.. మన్మోహన్పై సోనియా ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్కి సోనియా శాలువ కప్పి సత్కరించడంతోపాటు జ్ఞాపికను అందజేశారు. మన్మోహన్కు సోనియా అందజేసిన జ్ఞాపికపై సిడబ్ల్యుసి సభ్యులందరూ సంతకం చేశారు. కాగా, ఈ విందు కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం గమనార్హం. అయితే విందుకు ముందే మన్మోహన్ సింగ్ను రాహుల్ గాంధీ కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మే 17న మన్మోహన్ సింగ్ రాజీనామా
ప్రధాని మన్మోహన్ సింగ్ మే 17న రాజీనామా చేయనున్నారు. 16న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఆయన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తమ మంత్రివర్గం రాజీనామాను అందజేస్తారు. సంప్రదాయం ప్రకారం ఆయనను కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు పదవిలో కొనసాగాల్సిందిగా రాష్టప్రతి కోరతారు.
ఎన్నికల ఫలితాలపై దిగ్విజయ్ ధీమా
బెంగళూరు: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని ఎగ్జిట్పోల్స్ ప్రకటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ‘2004, 2009 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఎగ్జిట్ పోల్స్, మీడియాలు ఇలాంటి సర్వేలే ఇచ్చాయి. జరిగిందేమిటి?' అని దిగ్విజయ్ ఎదురు ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన దిగ్విజయ్ సుదీర్ఘ చరిత్రగల పార్టీకి ఇలాంటి ఒడిదుడుకులు మామూలేనని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారం మొదట్లో అభివృద్ధి గురించి మాట్లాడినా చివరికొచ్చేసరికి మత రాజకీయాలను తెరమీదకు తెచ్చిందని బిజెపిపై దిగ్విజయ్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్కు అధికారం ఉన్నా లేకున్నా సోషలిజం, సెక్యులరిజం కోసం పోరాడుతునే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ప్రజాస్వామ్యం అంటేనే మార్పు. ప్రభుత్వంలో ఉండి ఎన్నికల్లో పోరాడాం. మాకు మళ్లీ అవకాశం వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం' అని దిగ్విజయ్ అన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా.. రాహుల్ గాంధీ నాయకత్వంపై పార్టీకి ఎంతో గౌరవరం ఉంది అని ఆయన చెప్పారు.