వర్షాకాలం వచ్చేసింది: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ: వేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు అందింది. అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించాయి.
మంగళవారం ఈ రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. తొలుత జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
అయితే, మూడు రోజుల ముందుగానే అంటే మే 29నే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. కాగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.
రుతుపవనాల రాకతో కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, రుతుపవనాలు సోమవారమే కేరళను తాకినట్లు స్కైమెట్ పేర్కొంది.