విదర్భ: పవార్ సై, ఆత్మరక్షణలో బీజేపీ, సేనకి తలనొప్పి
ముంబై: ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్ధించి తెలంగాణ ఏర్పాటుకు చేయూతనిచ్చిన భారతీయ జనతా పార్టీతో పాటు పలు పార్టీలకు మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలలో విదర్భ రాష్ట్రం ఏర్పాటు సమస్యాత్మకంగా మారింది. తమ ప్రభుత్వానికి మద్దతు పలికిన చంద్రబాబు ఒత్తిడి వల్లే తెలంగాణ ఇవ్వలేకపోయామని ఆరోపించినట్లే తమ చిరకాల భాగస్వామ్యపక్షమైన శివసేన ఒప్పుకోనందుకే విదర్భను ఇవ్వలేకపోయామని బిజెపి.. శివసేనపై నెపం నెడుతోంది.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ విదర్భ అంటోందని శివసేన మండిపడింది. అయితే, ఈ ఎన్నికల్లో విదర్భ అంశాన్ని ప్రస్తావించకూడదని కమలనాథులు కూడా భావించారు. కానీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ విదర్బను ఎత్తుకొని షాకిచ్చారు. విదర్భ ప్రాంతంలో అరవై రెండు అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికలలోకాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 28 స్థానాలను కైవసం చేసుకోగా బిజెపికి 14 లభించాయి.
గత ఐదేళ్లలో విదర్భలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినా పరిస్థితిలో చెప్పుకోతగిన మార్పులేదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము సుముఖమేనని లోకసభ ఎన్నికలలో ప్రకటించిన బీజేపీ విదర్భను రాష్ట్రంగా చేస్తామని ప్రకటిస్తే ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విభజనకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విదర్భ విషయంలో మౌనం పాటించాలని భావించింది.
అయితే మాజీ మంత్రి శరద్ పవార్ ప్రజలు కోరుకుంటే విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయటానికి వెనుకాడబోమని ప్రకటించటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. మహారాష్ట్ర విభజనను కోరుకోవటం లేదనీ అయితే ప్రజాభీష్టాన్ని గౌరవించవలసిన అవసరం ఉన్నందున తీర్పు తమకు అనుకూలంగా వస్తే రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేస్తామని శరద్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో విదర్భ జోలికిపోకుండా ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
విదర్భ అంశం అత్యంత సున్నితంగా మారిందని బీజేపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నంత కాలం రాష్ట్ర విభజనకు అంగీకరించని తమ పార్టీ ఎన్నికల ప్రచారంలో వెలువడే సంకేతాలను బట్టి భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. విదర్భ శివసేనకు మరింత ఇబ్బందికరంగా మారింది. విభజనకు శివసేన నో చెబుతోంది.