లక్షలాది కేసులు: ప్రధాని, చంద్రబాబు ముందే సుప్రీం సీజే కంటతడి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆదివారం నాడు కంటతడి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్యమంత్రుల సమక్షంలోనే జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. తన దస్తీతో ఆయన తన కన్నీళ్లను తుడుచుకున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 40వేల జడ్జిలను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 21వేల మంది జడ్జిలు ఉన్నారని, ఆ సంఖ్యను నలభై వేలకు పెంచాలని చెప్పారు.
హైకోర్టులలో 38 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. మౌలిక వసతులు, స్టాఫ్, జడ్జిల నియామకం కావాలన్నారు. కేసుల పరిష్కారానికి ముఖ్యమంత్రులు సహకరించాలన్నారు. కేవలం అలహాబాదు కోర్టులోనే పది లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని చెప్పారు.
అయిదేళ్ల పై బడిన కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దేశంలో జడ్జిలు పరిమిత స్థాయిలోనే ఉన్నారని, ఇలాంటి సమయంలో దేశ అభివృద్ధి కోసం ప్రతి బరువును న్యాయవ్యవస్థ పైన మోపవద్దన్నారు. ప్రస్తుతం ఒక్కో జడ్జి 2,600 కేసులు హ్యాండిల్ చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ఒక్కో జడ్జి వద్ద 81 కేసులు ఉన్నాయన్నారు. అదే సమయంలో కింది కోర్టులు ప్రతి ఏటా రెండువేల కోట్ల కేసులను హ్యాండిల్ చేస్తున్నాయని చెప్పారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. చీఫ్ జస్టిస్కు న్యాయమూర్తుల భర్తీ పైన హామీ ఇచ్చారు. న్యాయవ్యవస్థ పైన తమ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందన్నారు. తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామన్నారు.