జయలలిత ఆరోగ్యంపై ఆందోళన కలిగించిన లేఖ, మాలిని ట్వీట్ కలకలం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత నెల 22వ తేదీ నుంచి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జయ ఆరోగ్యం పైన వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. దీంతో పలువురు ఆమె ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అనుమానమే కొందరు ఆకతాయిలకు పని పెట్టింది. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. ఇటీవల ఆమె ఫేక్ ఫోటో బయటకు వచ్చింది. ఐసీయూలో జయలలిత చికిత్స పొందుతున్న ఫోటో ఇదేనంటూ ఓ ఫోటోను నెట్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో వైరల్ అయింది. చివరికి ఫేక్ ఫోటోగా తేల్చేశారు.
తాజాగా మరో వ్యవహారం వెలుగు చూసింది. పోస్ట్ చేసింది ఎవరో తెలియదు. కానీ ఆమెకు సంబంధించిన హెల్త్ బులిటెన్ను అపోలో ఆస్పత్రి ప్రెస్ రిలీజ్ చేసినట్లు అచ్చు గుద్దినట్లు ముద్రించారు. కానీ వారి తప్పుల తడకలా ఉన్న ఇంగ్లీష్ రాత వల్ల అది ఆస్పత్రి విడుదల చేసిన లేఖ కాదని తేలిపోయింది.
ముఖ్యమంత్రిని గౌరవార్థం హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని అంటారు. అయితే ఈ లేఖ విడుదల చేసిన వారు ఆమె అనారోగ్యం సమస్యలకు కూడా హానరబుల్ డీహైడ్రేషన్, హానరబుల్ ఫీవర్ అంటూ గౌరవార్థాన్ని జోడించారు. ఎక్కడా పొంతన లేకపోవడంతో ఎవరో ఆకతాయిలు సృష్టించినదిగా గుర్తించారు. ఓ సీఎం పైన ఇలాంటి అవాస్తవాలు చెప్పడం సరికాదంటున్నారు.
మాలిని ట్వీట్ కలకలం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయకు వెంటిలేటర్ పూర్తిగా తొలగించారని మాజీ సంపాదకులు మాలిని పార్థసారథి చేసిన ట్వీట్ కలకలం సృష్టించింది. స్టాలిన్ అపోలో ఆసుపత్రికి వచ్చిన వెంటనే ఆమె ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆమె కోలుకుంటున్నారని, జయకు వెంటిలేటర్ తొలగించడం శుభసంకేతమని, ట్రాకియోస్టామీ (గొంతులో రంధ్రం చేసి గొట్టం పెట్టడం) చేస్తున్నారని తనకు తెలిసిందని పేర్కొన్నారు. ఇలా ఉండగా అపోలో ఆసుపత్రి విడుదల చేసిన వైద్య నివేదిక మాత్రం జయలలితకు కృత్రిమశ్వాస (రెస్పిరేటరీ సపోర్ట్)ను కొనసాగిస్తున్నామని, దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.