కరోనా 'మహా' కష్టాలు..!ఇరుకుగదిలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు..!!
అమరావతి/హైదరాబాద్ : కష్టాలు, కన్నీళ్లు చెప్పి రావు అనడానికి కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభమే పెద్ద ఉదాహరణ. కరోన మహమ్మారి వల్ల దేశం మొత్తం ఉన్నట్టుండి స్తంభించిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎక్కడివారక్కడే ఫ్రీజ్ అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాగా జీవనోపాదికోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యింది. దేశంలోని అనేక ప్రాంతాలకు వివిధ పనులకోసం వెళ్లిన వారు ఘోరంగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం ఉన్నట్టుండి లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్టు తెలుస్తోంది. రవాణా వ్యవస్ధ పూర్తిగా స్ధంభించిపోడంతో ఊరికాని ఊళ్లలో పడరాని కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
కర్నూలును కలవర పెడుతున్న కరోనా..! అంతుచిక్కని పరిస్థితిపై అధికారుల్లో నెలకొన్న అయోమయం..!!
కరోనా కష్టాలు.. చుక్కలు చూస్తున్న నిరుద్యోగులు..
తెలుగు రాష్ట్రాల నుండి జీవనోపాది కోసం మహారాష్ట్ర వెళ్లిన తెలుగు వారి పరిస్ధితి దారుణంగా తచారైనట్టు సమాచారం అందుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ రాయితీలను అందుకోలేక, ఉండడానికి నివాసం లేక, తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. తమను విడింపించి సొంత గ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని మహరాష్ట్రలో చిక్కుకుపోయి వలస కూలీలు వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. గత 40రోజులుగా చిన్న గదిలో 40మంది వరకు జీవనం గడపుతున్నట్టు వారు చెప్పుకొస్తుండడం ఎంతో హృదయవిదారంగా మారింది.
రాష్ట్రం కాని రాష్ట్రంలో యువత కష్టాలు.. చిన్న గదిలో గడుపుతున్న 40మంది..
మహారాష్ట్రలో చిక్కుకుపోయి వలస కార్మికులు చెప్పన అంశాలు ఎంతో దయనీయంగా ఉన్నాయి. 40 రోజులుగా ఒకే గదిలో, ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది నివాసం ఉన్నారంటే ఎంత చిత్రహింసల అనుభవించారో ఊహించుకోవచ్చు. లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలో తెలుగు యువకులు పడుతున్న కష్టాలకు నిలువెత్తు నిదర్శనాలు ఇవి. మొత్తం 500 మంది, ఒక్కో రూముకు 40మంది ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నియి. లాక్డౌన్ ఆంక్షలను కాదని వేరే ప్రాంతానికి వెళ్తే పోలీసులు కేసులు పెట్టే అవకాశం ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో చిక్కుకుపోయారు తెలుగు యువకులను విడిపించేందకు ఏపి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఉద్యోగం ఇస్తున్నట్టు ఆఫర్ లెటర్.. క్షణాల్లో మహరాష్ట్రకు వెళ్లిన కడప వాసులు..
కడప జిల్లాకు చెందిన 500 మంది యువకులు ఉద్యోగాల కోసం మహారాష్ట్ర వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకుపోయారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగాల పేరిట ఆహ్వానం అందగానే సుమారు 500 మంది యువకులు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ చేరుకున్నారు. ఉద్యోగం సంగతి పక్కన పెడితే లాక్డౌన్ నేపథ్యంలో గత నలభై రోజులుగా వీరంతా పడరాని కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సుమారు 40 మంది ఒక చిన్న గదిలో ఉండిపోయారు. అయినప్పటికీ ఆ చిన్న గది అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం అందుతోంది. కనీసం తాగడానికి నీళ్లు లేక అవస్థల పాలవుతున్నారు. ఆకలి తీరడానికి ప్రభుత్వం ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నా గది అద్దె డబ్బుల కోసం మాత్రం ఒత్తిడిలు తీవ్రమవుతున్నాయని వారు చెబుతున్నారు.
తెలుగు ప్రభుత్వాలు స్పందించాలి.. తమను విడిపించి సొంత గ్రామాలకు తీసుకెళ్లాలని విజ్ఞప్తులు..
తమ దీనావస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలపాలంటూ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేసి కొంత మంది యువకులు పంపిస్తున్నారు. ఆదాయం లేక, బయటకు వెళ్లే పరిస్థితులు లేక, కనీసం గది అద్దె కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైనా చొరవ చూపించి తమ సొంత ప్రాంతాలకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఎక్కువ మంది కడప జిల్లాకు చెందిన వారుండగా, తెలంగాణకు చెందిన వారు కూడా కొంత మంది వున్నారని తెలుస్తోంది. తమకు తమ స్వస్థలాలకు చేర్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు చొరవ చూపాలని వారు వాట్సప్ సందేశాల ద్వారా వేడుకుంటున్నారు.