సరిహద్దులో యుద్ద మేఘాలు: భారీగా మోహరించిన పాక్ దళాలు
శ్రీనగర్: మరోసారి భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సర్జికల్ దాడుల తర్వాత భారత్పై రగిలిపోతున్న పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది. సరిహద్దులో 190 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ తన బలగాలను భారీగా మోహరించింది. అంతేగాక, భారీగా ఆయుధాలను తరలిస్తోంది.
వారం రోజుల నుంచి సరిహద్దు వద్ద పాక్ సైన్యం కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, ఇప్పటికే సరిహద్దు ఆవల ఉన్న పాక్ సైన్యానికి చెందిన నాలుగు పోస్టులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో, పాక్ చేస్తున్న సన్నాహకాలపై భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.
పాక్కు దిమ్మతిరిగే రీతిలో ధీటైన సమాధానం చెప్పేందుకు భారత దళాలు కూడా సిద్ధమవుతున్నాయి. కోలుకోలేని రీతిలో పాక్ను దెబ్బతీయాలని భారత సైన్యం భావిస్తోంది. ఈ క్రమంలో, సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ నవంబర్ నెలాఖరులో పదవి నుంచి వైదొలగుతున్నారు. ఈ నేపథ్యంలో, తన చివరి రోజుల్లో ఆయన సైనికపరంగా భారత్కు వ్యతిరేకంగా ఏమైనా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.