బెంగళూరులో ఉబెర్ ట్యాక్సీ సర్వీసులు నిలిపేయండి: కమిషనర్
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఉబెర్ షేర్ రైడ్ సేవలు నిలిపివేయాలని ట్రాఫిక్ కమిషనర్ అయ్యప్ప కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి ట్యాక్సీసేవలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఉబెర్ సంస్థ షేర్ రైడ్ సేవలు కొనసాగిస్తున్నది. ఇటీవల షేర్ రైడ్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షేర్ రైడ్ సేవలు నిలిపివెయ్యడానికి ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తేది శుక్రవారం డెడ్ లైన్ పెట్టింది. ఇదే విషయం బెంగళూరు నగర ట్రాఫిక్ కమిషనర్ అయ్యప్ప ట్యాక్సీ సేవల నిర్వహిస్తున్న కంపెనీలకు సమాచారం ఇచ్చారు.
తాము ప్రభుత్వ నియమాలు పాటించి షేర్ రైడ్ సేవలు నిర్వహిస్తున్నామని ఉబెర్ సంస్థ వ్యవస్థాపకుడు క్రిస్టియన్ ఫ్రీస్ అంటున్నారు. ఈ విషయంపై బెంగళూరు ట్రాఫిక్ కమిషనర్ అయ్యప్ప స్పందిస్తూ మీ సేవలు చట్టవ్యతిరేకం అని ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు.
అనేక కారణాల వలన షేర్ రైడ్ సేవలు నిలిపివేయాలని చెబుతున్నామని వివరించారు. అయితే ప్రభుత్వం తమ మీద ఇలా చర్యలు తీసుకుంటుందని, షేర్ రైడ్ సేవలు నిలిపి వేయాలని చెబుతున్నదని, మీ మద్దతు కావాలని ఉబెర్ సంస్థ ఆన్ లైన్ లో తన కస్టమర్ల నుంచి సంతకాలసేకరణ మొదలు పెట్టంది.