దాడులు చేసే దేశంతో ఆటలా: క్రికెట్ మ్యాచ్పై ఉద్ధవ్
ముంబై: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా మరో నాలుగైదు రోజుల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ని అడ్డుకుంటామని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఆదివారం నాడు హెచ్చరించారు.
ఓ చేత బాంబులు, మరో చేత్తో క్రికెట్ ఆడలేమని చెప్పాడు. భారత్ పైన దాడులు చేయిస్తున్న దేశంతో ఆటలు ఏమిటన్నదే తమ ప్రశ్న అన్నారు. క్రీడలకు తాము వ్యతిరేకం కాదని, కబడ్డీ మ్యాచ్లు ఆడతారు, క్రికెట్ ఆడతారు.. ఇదే సమయంలో చొరబాట్లకు, ఉగ్రదాడులకు సహకరిస్తారని మండిపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో ఈ నెల 19న జరగాల్సిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠత మధ్య కోల్కతాకు మారిన విషయం తెలిసిందే. తాము భారత్ పాక్ మ్యాచ్కు రక్షణ కల్పించలేమని హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చెప్పారు. రక్షణ కల్పించలేమన్న వీరభద్ర సింగ్ పైన ఉద్ధవ్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో కోల్కతాలో మ్యాచ్ జరుగుతున్నందున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన మండిపడ్డారు.