ఉండవల్లి, సీమాంధ్ర టిడిపిల అవిశ్వాసం: ప్రధాని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం కేంద్రం పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇక నుండి ప్రతి రోజు ఒక ఎంపీ పేరు మీద కేంద్రం పైన అవిశ్వాస నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా లోకసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివ ప్రసాద్లు నోటీసును సభాపతి మీరా కుమార్కు అందజేశారు.
జాతీయ స్థాయిలో తమకు అనుకూలంగా పార్టీలను కూడగడతామని చెప్పారు. కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ తాము పార్లమెంటులో నిరసనకు దిగుతామని కాంగ్రెసు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. తాము పార్లమెంటులో తప్పనిసరిగా తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు రాష్ట్రపతి కచ్చితంగా తోసిపుచ్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన విషయం హైదరాబాదులో తేల్చాలని, తాను అవిశ్వాస నోటీసుకు వ్యతిరేకమన్నారు.
సహకరించాలి: ప్రధాని
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అందరు సహకరిస్తారని తాము ఆశిస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. పార్లమెంటు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు ఆర్థికమంత్రి చిదంబరం మాట్లాడుతూ.. పార్లమెటులో బిల్లుల ఆమోదంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఏ బిల్లు అయినా ఆమోదం పొందుతుందా అన్నారు.