అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం.. ఏపీ ఎంపీ అనుచరుడినని చెప్పుకుంటూ...
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముంబయి పర్యటనలో భద్రతా లోపం బయట పడింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అమిత్ షా ఈవారం ప్రారంభంలో పర్యటించారు. ఆ సమయంలో లోపం వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. కేంద్ర హోంశాఖకు చెందిన అధికారినంటూ చెప్పుకున్న ఒక వ్యక్తి షా వెంటే తిరిగాడని, అతన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
భారతీయ జనతాపార్టీ నేతలతో పార్టీకి సంబంధించి కార్యకలాపాలపై చర్చించేందుకు అమిత్ షా రెండురోజులు ముంబయిలో పర్యటించారు. నిన్నటితో ఆ పర్యటన ముగిసింది. ఒక వ్యక్తి హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంతో కలిసిపోయాడు. కొన్ని గంటలపాటు షాకు దగ్గరగా మెసిలాడు. అయితే అతడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే అధికారులు ముంబయి పోలీసులకు సమాచారమిచ్చారు. అతడి పేరు హేమంత్ పవార్ అని, భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని విచారణలో వెల్లడైంది. పవార్ ను అరెస్ట్ చేసి ఐదురోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ అనుచరుడినని హేమంత్ చెప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అతడు ఏ ఎంపీ పేరు చెప్పాడనే విషయాన్ని వెల్లడించలేదు.
అసమ్మతి నేతలు తిరుగుబాటు చేయడంతో కొద్ది నెలల క్రితం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోయింది. అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా షా ముంబయిలో పర్యటించారు. అటువంటి సమయంలోనే భద్రతా లోపం వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు లోపం ఎక్కడుందనే విషయమై విచారణ చేస్తున్నారు.