గుర్మీత్ బాబా గురించి తెలియనివి: లాకెట్, దుస్తులపై ఆసక్తికర విషయాలు..
భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ లాకెట్ వన్ రూపంలో, నీలి రంగులో ఉంటుంది.
చంఢీగఢ్: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. ప్రస్తుతం దేశమంతా ఈ బాబా గురించే చర్చ. పంచ్కుల సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిలించింది. దేశంలో శాంతిభద్రతల గురించి రాష్ట్రపతి సైతం కలవరపడే విధ్వంసానికి అది దారి తీసింది.
'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..
ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ డేరా బాబా గురించి ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఆరా తీస్తోంది. నిన్న మొన్నటిదాకా ఉత్తరభారతానికి తప్ప దక్షిణ భారతానికి ఈ బాబా అంతగా తెలియదు. కానీ శుక్రవారం నాటి సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలోను ఆయన కోసం లక్షల మంది జనం రోడ్ల మీదకు రావడం.. ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది.
మెడలో ప్రత్యేక లాకెట్:
తాజాగా ఆయన మెడలో ఉండే లాకెట్ గురించి ఆసక్తికర చర్చ విషయాలు తెర పైకి వచ్చాయి. రామ్రహీమ్ నిత్యం ఒక ప్రత్యేకమైన లాకెట్ను ధరిస్తుంటారు. ఆయన భక్తులు దీనిని పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు.
నెంబర్ వన్ ఆకారంలో ఉండే ఈ లాకెట్ నీలి రంగులో ఉంటుంది. ఈశ్వరుడు ఒక్కడేనన్న భావనతో ఈ లాకెట్ను నంబర్ వన్ రూపంలో రూపొందించినట్లు ఆయన భక్తులు చెబుతారు. ఇదే లాకెట్ లో రామ్ రహీమ్ గురువులతో పాటు ఆయన ఫోటో కూడా ఉంటుంది.
దీని కింది భాగంలో 'ఇన్సా' అని రాసి ఉ:టుంది. రామ్ రహీమ్ తో పాటు డేరా సచ్చా సౌదా అనుయాయులు ఒకరికొకరు ఎదురపడ్డప్పుడు 'ఇన్సా' అని పలకరించుకుంటారు.
దుస్తులు స్వయంగా డిజైన్
అప్పట్లో గుర్మీత్ బాబా కుర్తా-పైజామాల్లోనే ఎక్కువగా ఉండేవాడు. కానీ రాను రాను స్టైలిష్ దుస్తులను అలవాటు చేసుకున్నాడు. జీన్స్ సహా ఆయన దుస్తులన్నింటిని స్వయంగా డిజైన్ చేసుకుంటాడు. 2007లో ఆయన సిక్కుల గురువు గురుగోవింద సింగ్ డ్రెస్లో కనిపించడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తిసింది.
విదేశాల్లోను భక్తులు:
ఒక్క ఇండియాలోనే కాక అమెరికా, కెనడా,ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, యుఏఈ లాంటి దేశాల్లోను రామ్ రహీమ్కు కోట్ల మంది భక్తులున్నారు. దేశంలోని హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, యూపీ గుజరాత్లో చాలామంది ఈయనను దైవ సమానుడిగా ఆరాధిస్తారు. ఒక్క హర్యానాలోనే డేరా బాబాకు 25లక్షల మంది భక్తులు ఉండగా, దేశవ్యాప్తంగా 50కి పైగా ఆశ్రమాలు ఉన్నాయి.
దేశ శాంతిభద్రతలకే సవాల్గా:
డేరా బాబా ఫాలోయింగ్ చూశాక చాలామంది ఆశ్చర్యపోయారు. ఆయన సీబీఐ కోర్టుకు వస్తున్న క్రమంలో వాహనాలకు అడ్డుపడ్డారు. 800వాహనాల కాన్వాయ్తో బాబా సీబీఐ కోర్టు వద్దకు వచ్చారంటే.. ఈయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చాలామంది భక్తులు తిండి తిప్పలు మానీ మరీ ఆయన నిర్దోషిగా తిరిగి రావాలని ఎదురుచూశారు. కానీ తీర్పు ప్రతికూలంగా రావడంతో లక్షల మంది జనం రోడ్ల మీదకు వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. బాబా అనుచరుల వల్ల చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 31మంది మృత్యువాత పడగా.. ఈ సంఖ్య మరింత పెరుగుతోందేమోనన్న ఆందోళన నెలకొంది.