వామ్మో.. రెండు డోసులు తీసుకున్న డాక్టర్కి కరోనా, ఎక్కడంటే
దేశంలో తగ్గుముఖం పడుతుందన్న క్రమంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వైరస్ సోకినవారికి రెండు డోసులు కంపల్సరీగా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత వైరస్ సోకుతుండడం కలకలం రేపుతోంది. కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నా.. వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జార్ఖండ్లోని జంషెడ్పూర్ లో ఈ ఘటన జరిగింది.
వైద్యుడి భార్యకు కరోనా సోకిందని జిల్లా నోడల్ అధికారి తెలిపారు. వైద్యుడు రెండు డోసుల టీకా వేయించుకున్నారని.. అతని భార్య వేయించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని వివరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థత 60 శాతం కాగా, కోవాక్జిన్ సమర్థత 80 శాతం ఎక్కువేనని చెప్పారు. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని.. కేసును నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
జనవరి 19వ తేదీన కోవిషీల్డ్ మొదటి మోతాదు తీసుకున్నామని.. అనంతరం ఫిబ్రవరి 16వ తేదీన రెండో డోస్ తీసుకోవడం జరిగిందని వైద్యుడు వెల్లడించారు. పది రోజుల క్రితం తన భార్యకు జ్వరం వచ్చిందని, చికిత్స చేసినా తగ్గలేదన్నారు. అప్పుడు టెస్టు చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. తనకు లక్షణాలు స్వల్పంగా ఉన్నా..తన భార్య, కొడుకు మాత్రం తీవ్రంగా ఉన్నాయన్నారు. రెండు సంవత్సరాల క్రితం నోటి క్యాన్సర్తో బాధ పడ్డానని, ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగిందని పేర్కొన్నారు.
టీకా తీసుకున్నందు వల్ల తక్కువ ప్రభావితం చూపించి ఉండవచ్చన్నారు. నెల రోజుల క్రితం తన భార్య అంబాగన్లో ఉన్న ఓ బ్యూటీ పార్లర్ను సందర్శించామని వెల్లడించారు. తూర్పు సింగ్బూమ్ జిల్లా హెల్త్ డిపార్ట్ మెంట్ ఇప్పటి వరకు 8 వేల మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. టీకాలు వేసిన వ్యక్తికి పాజిటివ్ రావడం మొదటి కేసుగా తెలిపారు. రెండో మోతాదు తీసుకున్న అనంతరం రోగ నిరోధక శక్తి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.