'రెండాకులు' ఎవరికి కేటాయించకపోవడానికి కారణమిదే!?
మొత్తం మీద రెండాకుల సెంటిమెంటుతో ప్రజలను ఆకట్టుకోవాలని భావించిన ఈ ఇరువురికి ఇదో భారీ షాక్ గా పరిణమించింది.
చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నిక ముంగిట 'రెండాకుల' చిహ్నాం మీద నెలకొన్న పంచాయితీ అటు శశికళకు ఇటు పన్నీర్ సెల్వంకు ఇద్దరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పార్టీ గుర్తు దక్కినవారు అమ్మ వారసులుగా ఎన్నికల్లో సెంటిమెంటును ప్రచారం చేసుకునే అవకాశం చిక్కేది. కానీ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ఇద్దరు నేతలు డైలామాలో పడ్డారు.
బుధవారం నాడు దాదాపు ఆరుగంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న సీఈసీ గుర్తును ఎవరికీ కేటాయించడం లేదని వెల్లడించింది. తాత్కాలికంగా ఈ చిహ్నాన్ని ఎన్నికల నుంచి నిషేధిస్తున్నామని, దానికి గల కారణాన్ని ఎన్నికల కమిషన్ వివరించింది. ఇరుపక్షాలు దాఖలు చేసిన పేజీల కొద్ది వివరణలే ఇందుకు కారణమని చెప్పింది.
కేవలం ఒకరోజు ముందు దాదాపు 20పేజీల కొద్ది వివరణను ఇరు వర్గాలు దాఖలు చేశారని, ఒక్క రోజులో వాటిని పరిశీలించి తీర్పు ఇవ్వడం సాధ్యపడదని, అందువల్లే నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టి తాత్కాళికంగా రెండాకుల గుర్తును నిషేధిస్తున్నట్లు తెలిపింది.

మొత్తం మీద రెండాకుల సెంటిమెంటుతో ప్రజలను ఆకట్టుకోవాలని భావించిన ఈ ఇరువురికి ఇదో భారీ షాక్ గా పరిణమించింది. ఆర్కేనగర్ లో సత్తా చాటేవారికే భవిష్యత్తులో మంచి పొలిటికల్ మైలేజీ ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.
అటు అన్నాడీఎంకె నుంచి దినకరన్, ఇటు పన్నీర్ వర్గం నుంచి మధుసూదన్, మరోవైపు జయలలిత మేనకోడలు దీప.. వీరి మధ్యలో బీజేపీ.. వీరిలో ఆర్కేనగర్ ఓటరు నాడిని పట్టుకునేదెవరో తెలియాలంటే ఏప్రిల్ 12న జరిగే ఎన్నిక దాకా వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications